ఒకసారి పార్టీలో నుండి వెళ్లి మళ్లీ వచ్చిన వారికి ఎలాంటి ప్రాధాన్యత జగన్ ఇవ్వరనడానికి నిదర్శనంగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు నిలుస్తారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నెల రోజుల లోపే టిడిపి నుండి జూపూడి వైసిపిలోకి వచ్చేసినప్పటికీ ఆయనకు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రాధాన్యతను జగన్ ఇవ్వడం లేదు .ప్రకాశం జిల్లాకు చెందిన ఈ దళిత నేత జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్సీ అయ్యారు.
మాలమహానాడు అధ్యక్షుడిగా ఉంటూ విజయవాడ లో మాలల విశ్వరూప సభను నిర్వహించి దానికి రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించి ఆయన దృష్టిలో పడి జూపూడి ఎమ్మెల్సీ కాగలిగారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వెంట జూపూడి నడిచారు. పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు అప్పట్లో జగన్ ఆయనకు అప్పగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొండేపి టిక్కెట్ కూడా ఆయనకు ఇచ్చినప్పటికీ జూపూడి టిడిపి అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి చేతిలో ఓడిపోయారు. వెనువెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండానే జూపూడి తెలుగుదేశం లోకి దూరి పోయారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన జూపూడి పార్టీ మారడం జగన్ కి కూడా మనస్తాపం కలిగించింద౦టారు.ఇక తెలుగుదేశంలో చేరిన జూపూడికి చంద్రబాబునాయుడు బాగానే ప్రాధాన్యమిచ్చారు.ఎమ్మెల్సీ చేద్దామనుకుంటే చివరి నిమిషం లో సాంకేతిక పరమైన ఓటు హక్కు సమస్య తలెత్తడంతో ఆయన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.అంతేగాకుండా టిడిపి మౌత్ స్పీకర్ గా జూపూడి పనిచేస్తూ అనేక న్యూస్ చానెళ్లలో వైసిపిని తీవ్రంగా దుమ్మెత్తి పోసేవారు. జగన్ పై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఇంతలో సీన్ మారింది .మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి చేసింది .
జగన్ సీఎం అయ్యారు.అంతే.. యథాప్రకారం మళ్లీ జూపూడి వైసీపీలోకి ప్రవేశించారు. ఆ తర్వాతనే వైసీపీలో ఆయన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. పార్టీలోకి అయితే చేర్చుకున్న జగన్ తనదైన శైలిలో జూపూడిని తొక్కి పెడుతున్నారు. పార్టీలో గాని ,ప్రభుత్వంలో గానీ జూపూడి కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏదైనా పదవిని ఇస్తారని జూపూడి ఆశించినా అది జరగడం లేదు. కనీస కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అయినా ఇవ్వాలని జూపూడి కోరుకుంటున్నా వినేవారు కనిపించడం లేదు. పార్టీ వీడి వెళ్లి మళ్ళీ వచ్చే వారి విషయంలో జగన్ వైఖరి ఎలా ఉంటుందనడానికి జూపూడి వ్యవహారమే ఒక నిదర్శనం.