దుబ్బాక ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కిస్తుంది. పైగా ఇది కరోనా సమయంలో జరుగుతున్న ఎన్నికలు. నాయకులు ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుని ప్రజాస్వామ్యంలో నెగ్గుకు రావాల్సిన టైం. గతంలో మాదిరిగా ప్రచారం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేవు. పైగా జనాలు లేకపోతే నేతలకు ఆ కిక్కు ఉండదు. అలాగని రాజకీయ నాయకులు నేరుగా ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. ఈ మహమ్మారి దెబ్బతో ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచార శైలిని మార్చాల్సిన టైం ఆసన్నమైంది. ఏ టైంలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా అన్నది టిఆర్ఎస్ పార్టీ నేతల్లో ఒకరికొకరు ప్రశ్నించుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చాక ఎదుర్కొన్న అన్ని ఉప ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ దే గెలుపు. తెలంగాణ రాజకీయాల్లో ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ కి బలమైన బంధం ఉంది. టిఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నారాయణఖేడ్, పాడేరు ఉప ఎన్నికలను ఎదుర్కొంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల హఠాన్మరణంతో అప్పట్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత వచ్చిన పాడేరు బై ఎలక్షన్ ప్రచారంలో మాత్రం కేసిఆర్ పాల్గొనలేదు.
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అప్పట్లో పార్టీ సీనియర్లంతా పర్యవేక్షించారు. ఆ తర్వాత రెండో సారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చింది. ఇది కూడా కాంగ్రెస్ సిటే టిఆర్ఎస్ నేతలు అంతా హుజూర్ నగర్ లో ప్రచారం చేశారు. అప్పట్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించగా వాతావరణం అనుకూలించకపోవడంతో కెసిఆర్ సభ రద్దయింది. ఇప్పుడు దుబ్బాక వంతు వచ్చింది. ఇక్కడ సిట్టింగ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిశెట్టి రామలింగారెడ్డి చనిపోవడంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చేసింది. మంత్రి హరీష్ రావు ఇప్పటికే ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా అన్న సస్పెన్స్ పార్టీల్లో నెలకొంది.