బీజేపీ జనసేనల మధ్య క్రమంగా దూరం బాగా పెరిగిపోతోందని రాజకీయ వర్గాల టాక్.ఏపీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించపోవటం ఇక్కడ గమనార్హం.అలాగే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్లకపోవడం అక్కడి జనసైనికులకు కనీసం బిజెపికి మద్దతు ఇవ్వమని ఆయన చెప్పకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేన 2019 లో మాత్రం కమ్యూనిస్టులు బీఎస్పీ మద్దతుతో పోటీకి దిగింది. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.కాలక్రమంలో కమ్యూనిస్టులకు దూరమై కమలనాథుల చెంతకు జనసేనాని చేరారు.
పొత్తుపొడిచిన కొత్తలో.. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా ఇరు పార్టీలు కలసే చేసేవి. నిన్న మొన్నటి అంతర్వేది ఆందోళనల్లో కూడా జనసేన, బీజేపీ జెండాలు కలిసే ఎగిరాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టిందనే సంకేతాలు వెలువడుతున్నాయి.దీనికి ప్రధాన కారణం వైసిపిని బిజెపి దగ్గరకు తీస్తుండటం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ మధ్య కాలంలో వైసీపీ బీజేపీకి బాగా చేరువైంది నేరుగా ప్రధాని మోడీ ఆయనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాలతో ముఖ్యమంత్రి జగన్ టచ్ లో ఉన్నారు.వారు కూడా జగన్కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తూ స్నేహంగా మెలుగుతున్నారు.వ్యవసాయ బిల్లుకు వైసిపి మద్దతివ్వటం బీజేపీ అగ్రనాయకత్వానికి అమితంగా నచ్చింది.ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తనదైన పంథాలో వ్యవహారం నడుపుతోంది. ఇది జనసేనకు ఏమాత్రం నచ్చడం లేదు.ఈ కారణంగానే జగన్ అంటే జలసీతో రగిలిపోయే పవన్ పార్టీకి బీజేపీకి మధ్యగ్యాప్ పెరిగిపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు
ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ప్రసంగాలేవీ జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ, పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి కానీ షేర్ కాలేదు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం నిర్ణయాలను ప్రశంసించిన దాఖలాలు కూడా లేవు. వీటన్నిటి చూస్తుంటే బిజెపితో జనసేన హానీమూన్ ముగిసినట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు.ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా పవన్ కల్యాణ్ అందుకే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు అంటున్నారు.ఇప్పటికైతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న ఈ రెండు పార్టీల పోకడలు భవిష్యత్తులో ఏ విధంగా మారతాయి అన్నది చూడాలి.