మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్టు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. కర్నూలు ప్రాంతంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది భూమా కుటుంబానికి. తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభ మరణం తర్వాత ఆ కుటుంబానికి, వారికి బాగా పట్టున్న కర్నూలు పశ్చిమ ప్రాంతానికి, కార్యకర్తలకు, అభిమానులకు ఇప్పుడు భూమా అఖిలప్రియ నే పెద్ద దిక్కు. అటువంటి అఖిలప్రియ కిడ్నాప్ కేసులో అరెస్టు కావడం సంచలనమే రేపుతోంది. హైదరాబాద్ లోని హఫీజ్ పేట భూవివాదంలో ఆమె హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ రావు, ఆయన అన్నదమ్ములను కిడ్నాప్ చేసిన బృందానికి ఈమె నేతృత్వం వహించారని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం తతంగంపై ఇప్పుడు ఆమె చెల్లెలు భూమా మౌనిక రెడ్డి స్పందించి.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
భూమా మౌనిక మాటల్లో..
భూమా మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. అక్క అఖిలప్రియ అరెస్టులో అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో వెనుకుండి తమ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలపై ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండటంతో అక్కడి పోలీసులను ప్రభావితం చేసి అఖిలప్రియ అరెస్టుకు కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు అభిమానులు అధైర్యపడొద్దని అన్నారు. ఇకపై తాను అందరికీ అండగా ఉంటానన్నారు. సమస్య ఏదైనా తన నెంబరుకు ఫోన్ చేయాలన్నారు. రాజకీయాలు తనకెందుకు అనుకుంటే ఇందులోకి వచ్చే పరిస్థితులు కల్పించినట్టు చెప్తున్నారు. జనవరి 11న సోమవారం అక్కకు బెయిల్ వస్తుందని.. హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డ వరకూ ర్యాలీగా వెళ్లి.. భారీ బహిరంగ సభ నిర్వహించి ఇందులో భాగమైన వారి పేర్లు వెల్లడిస్తానని అన్నారు.
కుట్ర కోణం ఉందా..?
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆమె ఒక ఆడపిల్లను అరెస్టు చేశారని, రాజకీయ కుట్ర కోణం ఉందని, ఏపీ ప్రభుత్వమే ఆమె అరెస్టయ్యేలా చేసిందని అరోపిస్తూ కిడ్నాప్ అంశాన్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్ చేయడం, వారిని వదిలేసి వెళ్లిపోవడం.. వంటివి క్లియర్ గా రికార్డయినా మౌనిక చేసిన వ్యాఖ్యలు.. తమకేమీ సంబంధం లేనట్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోపక్క వీరికేమీ సంబంధం లేకపోతే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తోసహా కిడ్నాప్ గ్యాంగ్ లోని గుంటూరు శ్రీను తదితరులు ఇంకా ఎందుకు పరారీలో ఉన్నారనేది మాత్రం ఆమె వెల్లడించ లేదు. నిజానికి ఈ భూ వివాదం రెండు దశాబ్దాల నుంచీ ఉందని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డికి అనుచరుడిగా ప్రవీణ్రావు తండ్రి కిషన్ రావు ఉండేవారని అంటున్నారు. ఇలా 50 ఎకరాల్లో ఉన్న అత్యంత విలువైన భూమిలో వాటాల మేరకే ప్రస్తుత గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తల్లిదండ్రులు లేని పిల్లలమని.. తమకు గొడవలతో సంబంధం లేదని.. కూర్చుని సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మౌనిక అంటున్నా.. దీనిలో పెద్ద వివాదమే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఈ భూములు తెలంగాణ రాష్ట్ర ధరణి పోర్టల్ లో ప్రభుత్వ భూమిగా ఉందనేది మరింత సంచలనం రేపుతోంది. దీంతో పోలీసుల మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
విచారణలో బయటకొచ్చే వాస్తవాలు ఏంటి?
అయితే.. మౌనిక ఊహించి, ఘంటాపథంగా చెప్పినట్టు అఖిలప్రియకు బెయిల్ రాలేదు. మూడు రోజుల పోలిస్ కస్టడీకి అనుమతిస్తూ.. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు. మరోపక్క కిడ్నాప్ గ్యాంగ్ కోసం, భార్గవ్ రామ్ కోసం పోలీసులు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు పోలిసులు బృందాలుగా వెళ్లారు. ఇప్పుడీ అంశంలో కిడ్నాప్ కోణం ఒకెత్తైతే.. తెలంగాణ ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న హపీజ్ పేట భూములను అమ్మిందెవరు..? కొన్నది ఎవరు? పత్రాలు ఎలా సృష్టించారు? ఎప్పుడు క్రయ విక్రయాలు జరిపారు అనేదానిపై పోలీసులు శోధిస్తున్నారు. మరి.. మౌనిక రెడ్డి చెప్తున్నట్టు రాజకీయ కోణం ఏమై ఉంటుంది? రాజకీయ శక్తులున్నాయా.. అనేదానిపై కూడా విచారణ జరుగుతోంది. ఏదేమైనా ప్రతిపక్షంలో ఉండి కిడ్నాప్ యత్నానికి పూనుకుని కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక ఎటువంటి అంశాలు దాగున్నాయనేది భూమా కుటుంబీకులకే తెలియాల్సి ఉంది.