Ys Sharmila : పొలిటికల్ ఎంట్రీ సంచలనాలు ఇంకా చల్లారలేదు. నిజానికి ఆమె రాజకీయాలకు కొత్త కాదు. తండ్రి వైఎస్.. అన్న సీఎం జగన్ వల్ల రాజకీయాల్లో ఆమె మరింత పరిణితి చెందారని చెప్పాలి.
జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఓదార్పు యాత్ర చేపట్టిన తీరు.. జగనన్న వదిలిన బాణం అనే డైలాగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక 2019 ఎన్నికల సమయంలో అన్న తరపున చేసిన ప్రచారంలో ‘బై.. బై బాబు’ అని చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో పేలిపోయింది. జగన్ రాజకీయ పయనంలో గానీ.. విజయంలో కానీ షర్మిల పాత్ర ఎంతో ఉంది. అంతటి సంచలనాలు రేపిన షర్మిల ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టడమే ఎవరికీ అర్ధం కావట్లేదు. ఆమె పార్టీ వల్ల ఎవరికి లాభమో.. నష్టమో అనే అంశాలను పరిశీలిస్తే..
Ys Sharmila : షర్మిల.. టీఆర్ఎస్ వదిలిన బాణమా..?
తెలంగాణలో తిరుగులేని పార్టీ కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్నా అదే ఏకచత్రాధిపత్యం టీఆర్ఎస్ సొంతం. అయితే.. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ కోటకు తెలంగాణలో బీటలు పడుతున్నాయి. ఇన్నేళ్లలో తనకు ఎదురొచ్చిన ప్రతి పార్టీని తొక్కి పడేసిన కేసీఆర్ కు బీజేపీ ఎదురొస్తోంది. నిజామాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. దీంతో ఏకు మేకవుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆరెస్సే షర్మిలను రంగంలోకి దించిందా? అనే అనుమానం లేకపోలేదు. జగన్ తో కేసీఆర్ కు ఉన్న దోస్తీ ఇందుకు ఉపయోగపడే ఉంటుందని చెప్పాలి. షర్మిలను రంగంలోకి తీసుకొస్తే కాంగ్రెస్ గూటిలో ఉన్న రెడ్లు, బీజేపీకి ఆకర్షితులయ్యే వైఎస్ అభిమానులు షర్మిల వైపుకు వెళ్లడం ఖాయమనే ఇలా ప్లాన్ చేసినట్టు చెప్పాలి. అన్న పార్టీలతోపాటు టీఆర్ఎస్ కు ఓట్లు చీలినా.. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు తగ్గడం ద్వారా టీఆర్ఎస్ కు లాభం కలుగుతుందనేది నిజం. ఇవన్నీ ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యతను మరింత పెంచుతుంది కాబట్టి తద్వారా జగన్ కు, కేసీఆర్ కు ఇది ఆమోగ్యమైన, లాభదాయకమైన ఒప్పందం అని చెప్పాలి.
షర్మిల.. టీఆర్ఎస్ వదిలిన అస్త్రమా..?
బీజేపీ విషయానికే వస్తే.. బీహార్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను పన్నిన కుయుక్తులు తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల నాటి మతపరమైన అంశాల్ని ఎంతో ధైర్యంగా తెర మీదకు తెచ్చింది. ఇందుకు ఎంఐఎం పార్టీని ఉపయోగించుకుంది. నాయకులు హిందు, ముస్లిం అంశాలను ప్రస్తావించి ప్రజల్లో మతపరమైన భావనలను తీసుకొచ్చి ఎవరి ఓట్లు వారికి వెళ్లేలా చక్కటి ప్లానింగ్ వేసింది బీజేపీ. దీంతో రెండు చోట్లా బీజేపీకి లాభమే జరిగింది. ఇప్పుడిదే స్ట్రాటజీని తెలంగాణలో ఉపయోగించాలి. ఎంఐఎం దోస్తీతో చేసిన పని తెలిసిపోయింది కాబట్టి తెలంగాణలో మళ్లీ అదే గేమ్ ఆడలేదు. అందుకే వ్యూహాత్మకంగా షర్మిలను రంగంలోకి దించారని చెప్పాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దించి బీజేపీ గద్దెనెక్కించాలంటే ఓట్లు చీల్చాల్సిందే. అందుకే జగన్ తో చర్చించే షర్మిలతో పార్టీ పెట్టించారా అనే ఆలోచన రాకమానదు. ఫలితంగా కాంగ్రెస్ రెడ్లు, వైఎస్ అభిమానులు షర్మిల వైపు వెళ్తే తమకు లాభం జరుగుతందని బీజేపీ అధిష్టానం ఆలోచనగా చెప్పాలి.
అన్నా చెల్లెళ్ల వ్యూహమేనా..?
అయితే.. పై రెండు పార్టీలనే కాదు. షర్మిల పార్టీతో మాకు సంబంధం లేదని జగన్ వర్గం చెప్తున్నా ఇదంతా అన్నా చెల్లెళ్ల వ్యూహాత్మక స్కెచ్ అనే మాటలూ లేకపోలేదు. తెలంగాణలో వైఎస్ అభిమానులకు కొదవ లేదు. కాకపోతే వైఎస్ మరణం, తెలంగాణ ఏర్పాటు, కేసీఆర్ హవాలో మరో పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఫొటోతో అక్కడ వైసీపీ కంటే చెల్లెలితో పార్టీ పెట్టిస్తే రెండు రాష్ట్రాల్లో కూడా వైఎస్ ప్రాభవాన్ని తీసుకురావొచ్చనే ఏకాభిప్రాయం వీరిద్దరి మధ్య జరిగిందని అంటున్నారు. ఆలోచిస్తే దీనిని కూడా కాదనలేం. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల్లో మమత పార్టీకి పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్.. త్వరలో షర్మిల పార్టీకి పని చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా షర్మిల రాజకీయ పయనం ఈ మూడు అంశాల్లో ఏదొక దానికి ముడిపడి ఉందనే చెప్పాలి. లేదంటే.. ఏపీ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన రాష్ట్రంలో మళ్లీ ఏపీ వ్యక్తి చక్రం తిప్పడం అనే ఆలోచన ఊహించడానికే కాస్త కష్టం అని చెప్పాలి.