ఏపీలో మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులు నిర్ణయం వల్ల వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇటువంటి తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు పై ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలో కి రావాలని రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రెండు పార్టీల ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు. రైతు కన్నీరు పై రాజధాని నిర్మాణం రాష్ట్రానికి అరిష్టం అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ పై న్యాయనిపుణులతో చర్చిస్తామని పవన్ తెలిపారు. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ఎంపీలంతా రాజీనామా చేస్తే దెబ్బకు కేంద్రం దిగి వస్తుంది, మీతో పాటు నేను పోరాడతానని పిలుపునిచ్చారు.
ఆ సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు పెద్దగా పట్టించుకోలేదు. పవన్ చెప్పాడు కాబట్టి రాజీనామా చేశామని నాడు వైసీపీ ఎంపీలు కూడా చెప్పారు. కాగా ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో పవన్ మాట టీడీపీ ఎమ్మెల్యేలు వింటారా…?, అసలు వైసీపీ నాయకులు పవన్ కు ఎలాంటి కౌంటర్లు ఇస్తారు…? కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ మాట వినేదెవరు ? రాజీనామాకు స్పందించేది ఎవరు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ గా మారింది.