YSRCP: ప్రభుత్వోద్యోగులకూ, ప్రభుత్వానికీ మధ్య యుద్ధం జరుగుతోంది. సమ్మె మొదలైతే మరింత తీవ్రం కావడం ఖాయం. అయిదు రోజులుగా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదన వారు వినిపించారు. కానీ.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు జరిపిన నిరసనల హోరు ఊహకు అందనివి. దీంతో ప్రభుత్వం ఓ మెట్టు దిగుతుందనే భావించినా.. ప్రకటించిన పీఆర్సీకే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు వివరించాలని మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ ఆదేశాలు వెళ్లాయి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కూడా రంగంలోకి దిగింది. క్షణాల్లో రియాక్ట్ అయ్యే వైసీపీ సోషల్ మీడియాకు తెలుగులో మరొకటి సాటి లేదనే చెప్పాలి. అయితే.. ఉద్యోగుల స్పందించిన తీరుపై వీరు కూడా ఓ రేంజ్ లోనే చెక్ పెడుతున్నారు.
YSRCP: అందరికీ ఒకటే న్యాయం..
నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. ఇందుకు (YSRCP) వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగానే స్పందించింది. జీతాలు, సౌకర్యాలు, సెలవులు, ఆస్తులు ఇన్ని ఉన్నా.. ప్రభుత్వం ఇంకా ఇస్తున్నా ఈ నిందలేంటి..? అంటూ కౌంటర్ ఇచ్చింది. ఎవరికి ఎంత ఉన్నా.. న్యాయంగా ఎవరికి దక్కాల్సింది వారికి దక్కాల్సిందే. సీఎం సలహాదారులు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, జీతభత్యాలపై ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. వారికి కల్పించే సౌకర్యాలు సబబే అయితే.. ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సినవి దక్కాల్సిందే. ఉద్యోగుల పట్ల చంద్రబాబు ఎలా ఉన్నారో.. జగన్ ఎలా ఉంటున్నారో రాజకీయంగా పోల్చుకోవడం తప్పు లేదు. కానీ.. ఉద్యోగులను విమర్శించడం తప్పు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిలో వారు సౌకర్యాలేమీ కోరుకోవడం లేదు.
దూరం తగ్గించాలి కానీ..
ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలు ఆపగలగాలి కానీ.. వారి హక్కులను విమర్శించడం తప్పు. సామాన్యుడి నుంచి ఎంతటి స్థాయి వ్యక్తి అయినా ఇల్లు, కారు, ఆహారం.. తగినంత చాలు అని ఎవరూ సరిపెట్టరు.. ఏ అక్కడితో ఆగిపోరు కదా..! కొన్నిచోట్ల ప్రభుత్వంపై ఉద్యోగులు చేసే విమర్శలు శృతి మించడం తగనిదే.. కానీ.. వారిని కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలది. ఈ సమస్య ఇలాగే కొనసాగదు.. ఎప్పుడో.. ఎక్కడోచోట ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ.. ఈలోపు (YSRCP) సోషల్ మీడియా పేరుతో తమకున్న శక్తిని ఉద్యోగులపై చూపిస్తే.. వారూ తగ్గకపోగా.. ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది..!