ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే టెస్ట్ చేయించి డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని రోజులుగా తనని కలిసిన వారు పూర్తిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఐసోలేషన్ లో ఉండాలని కూడా పిలుపునివ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకోవటం పై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ విమర్శలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంటి అంటూ అమిత్ షా ని ప్రశ్నిస్తున్నారు. దేశ హోమ్ మినిస్టర్ తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎయిమ్స్కు వెళ్ళకుండా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకోవటం పై నేను ఆశ్చర్యానికి గురి అయ్యాను.
కరోనా చికిత్స విషయంలో ప్రజా ప్రతినిధులు ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రభుత్వ సంస్థలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని శశిధరూర్ చెప్పారు. ఇదే రీతిలో చాలామంది రాజకీయ నేతలు కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం పట్ల ప్రజలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పోయేట్టుగా పరిస్థితి నెలకొంది.
ఇటీవల వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ ఈ విధంగానే జరిగింది. ఆయనకు కరోనా నిర్ధారణ అయిన వెంటనే ట్రీట్మెంట్ కోసం ఏపీ ని వదిలి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో ఓ ప్రముఖ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడం పట్ల విమర్శలు చెలరేగాయి. ఈ విధంగా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన రాజకీయ నాయకులే మహమ్మారి కరోనా చికిత్స విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించటం అనేక విమర్శలకు తావిస్తోంది.