ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తామంటున్న కెసిఆర్ అందుకు సన్నాహాలు ఆరంభించారా?…అందులో భాగంగానే తెలంగాణా మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఈసారి సంక్రాంతికి ఎపిలో ఎక్కువ హడావుడి చేయించారా?…లేక కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా తలసానే చూసిరమ్మంటే కాల్చివచ్చిన చందంగా వ్యవహరించారా?…లేదూ తలసాని హడావుడి వెనుక ఇంకేదైనా కారణం ఉందా?…ఇవీ సంక్రాంతి సందర్భంగా ఎపీకి విచ్చేసిన తలసాని ఉదంతంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశాలు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలకు విచ్చేయడం…కోడిపందాలతో సహా ఏపీలోని సంక్రాతి సంబరాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా పాటిస్తున్నారు!… ఈ క్రమంలో తలసానికి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో సన్నిహిత మిత్రులైనవారు చాలామంది ఉన్నారు. ఒకరకంగా తెలంగాణా టిడిపి నేతల్లో ఎపిలో ఎక్కువమంది సన్నిహిత పరిచయాలు కలిగిన నేతల్లో తలసాని ముందు వరుసలో ఉంటారు. ఈ పరిచయాల నేపథ్యంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోయినా ఎపిలో సంక్రాంతి సంబరాలకు క్రమం తప్పకుండా హజరవుతున్నారని అంటారు.
అయితే ఇటీవలి తెలంగాణా ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమిలో కాంగ్రెస్ తో టిడిపి జత కలసి చేసిన హంగామా…ఆ క్రమంలో టిడిపిపై కత్తి కట్టిన టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తదనంతరం చేసిన “రిటర్న్ గిఫ్ట్” వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలకంటూ విజయవాడకు విచ్చేసిన తలసాని ఏకంగా యాదవ సంఘాలతో భేటీలు నిర్వహించడం, అనంతరం చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేయడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.
ఎపిలో సైతం యాదవులు రాజకీయ శక్తిగా ఎదగాలనీ, చంద్రబాబు హయాంలో బీసీలు అణగదొక్కబడ్డారంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో ఖంగుతిన్న ఎపి టిడిపి నేతలు వెంటనే ఎదురుదాడి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశ్యంతోనే కెసిఆర్ ప్లాన్ ప్రకారం తలసానితో ఈ విధంగా చేయించారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తలసాని వ్యాఖ్యలపై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరిగా ఉన్న తలసాని…గతంలో టిడిపి లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మారిన కాల మాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి తరుపున గెలిచిన తలసాని టిఆర్ఎస్ పార్టీలో చేరడం, అక్కడ కూడా మంత్రి పదవి దక్కించుకోవడమే కాకుండా అనతి కాలంలోనే ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరుగా మారారు. ఇలా టిడిపిపై గెలిచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి కావడంపై టిడిపి నేతలు విమర్శిస్తే అందుకు ధీటుగానే ప్రతిస్పందించేవారు తలసాని.
తనను విమర్శిస్తున్నటిడిపి నేతలు వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఎలా ఇచ్చారో చెప్పాలని, వారితో రాజీనామా చేయిస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్దమని సవాలు విసిరేవారు. తరుపున గెలిచానని తనను విమర్శిస్తున్న టిడిపి తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళతాననని వైసిపి నుంచి వచ్చి చేరినవారితో టిడిపి అదే పనిచేయించాలని సవాల్ చేసేవారు తలసాని. అయితే ఆ విమర్శలు,ప్రతి విమర్శలతోనే కాలం గడచిపోగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈసారి తలసాని టిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
దీంతో చంద్రబాబుపై మండిపడుతున్న తమ పార్టీ అధినే, సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా తాజా ఎపి ఎపిసోడ్ ను తలసాని నడిపించి ఉండొచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతుంటే… మరికొందరు మాత్రం ఈ హడావుడి ద్వారా కెసిఆర్ మనస్సు గెలుచుకొని మరోసారి మంత్రి పదవి పొందేందుకే తలసాని తనంతట తానుగా ఈ తతంగం నడిపి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.
అంతేకాదు టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన తలసాని ఆయన దగ్గర నేర్చుకున్న వ్యూహాలనే అమలు చేస్తూ ఈ తాజా కుల రాజకీయాన్నితెరమీదకు తెచ్చారనేది మరికొందరి అభిప్రాయం. ఏదేమైనా ఎపి టిడిపిలో తలసాని తాజా వ్యవహారం కొంత కలవరపాటుకు గురిచేసిందన్నది మాత్రం వాస్తవం అనేది రాజకీయ పరిశీలకులందరి ఏకాభిప్రాయంగా కనిపిస్తోంది.