పాదయాత్ర తరువాత జగన్ కు ఫస్ట్ షాక్ తగిలింది. వైసిపి కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అధినేత జగన్ కు ఈ షాక్ ఇచ్చారు. వంగవీటి రాధాకృష్ణ ఆదివారం తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ పంపించారు. తాను ముందు నుంచీ కోరుతున్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే సీటు పై ఇంతవరకూ జగన్ నుంచి ఏ హామీ రాకపోవడంతో ఇక వేచిచూడటం అనవసరమనే భావనతో ఆయన రాజీనామా సమర్పించినట్లుగా తెలుస్తోంది.
ఒకవైపు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు ప్రకటన ద్వారా జగన్ మరో సెల్ఫ్ గోల్ చేసినట్లుగా ఆ పార్టీ నేతల్లోనే కొందరు అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కాపులు అభిమానించే దివంగత నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కృష్ణ ఆ పార్టీని వీడటం గట్టి దెబ్బేనని చెప్పకతప్పదు. గతంలో కాపుల రిజర్వేషన్ కు సంబంధించిన వ్యాఖ్యలతో వారి మనోభావాలను గాయపరిచిన జగన్ మరోసారి వంగవీటి రాధా కృష్ణ విషయంలోనూ పంతంతో వ్యవహరించడం ద్వారా కాపుల వ్యతిరేకతను మరింత కూటగట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా అతి త్వరలోనే జగన్ తన నివాసాన్ని,పార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
విజయవాడ సెంట్రల్ సీటు కోసం పట్టుదలతో ఉన్న వంగవీటి రాధాకృష్ణ కు జగన్ ఆ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పేయడంతో పాటు వేరే ఆప్షన్స్ ఆయన ముందుంచారు. అయితే ఆ ఆప్షన్స్ ను ఏమాత్రం పట్టించుకోని వంగవీటి రాధా తనకు విజయవాడ సెంట్రల్ మాత్రమే కావాలని, అది ఇవ్వడం కుదరని పక్షంలో పార్టీని వీడటం ఖాయమని చాలా కాలం క్రితమే సంకేతాలు ఇచ్చేశారు. అయితే జగన్ కూడా వంగవీటి రాధా హెచ్చరికకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. దీంతో వీరి మధ్య అంతరం పెరిగిపోయి చివరకు తెగతెంపులు వరకు వచ్చేసింది.
వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలియడంతో చివరి నిమిషాల్లో ఆయనను పార్టీ వీడకుండా ఆపుచేసేందుకు చేసేందుకు పలువురు వైసిపి సీనియర్ నేతలు రంగంలోకి దిగి సర్థుబాటు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. వైసిపిలో సీనియర్ కాపు నేత బొత్స సత్యనారాయణ అయితే ఆదివారం కూడా వంగవీటి రాధాకృష్ణతో ఈ విషయం చర్చించారు. అయితే రాధా మరోసారి విజయవాడ సెంట్రల్ సీటు విషయమై తన నిర్ణయం మార్చుకునేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో వంగవీటి రాధా కృష్ణ తన రాజీనామా ప్రకటించేయడం జరిగిపోయింది.
అయితే వంగవీటి రాధాకృష్ణ విషయంలో జగన్ తీరు కాపు సామాజిక వర్గం వైపు నుంచి ఖచ్చితంగా వైసిపికి నష్టం కలిగించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసిపి నుంచి ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు విషయం కాగా మరోవైపు నుంచి చూస్తే మొత్తంగా కాపుల మనోభావాలతో ముడిపడి ఉండే ఈ అంశంలో జగన్ ఈ విధంగా ప్రవర్తించి ఉండాల్సి కాదని వారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ జగన్ తాను నిర్వహించిన సర్వేలో విజయవాడ సెంట్రల్ లో వంగవీటి రాధా గెలవరని తెలిసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఓట్లను దృష్టిలో పెట్టుకొని పట్టువిడుపులు ప్రదర్శించి ఉంటే బాగుండేదని, ఆ సీటును వంగవీటి రాధా గెలవరనే నెపంతో ఆయనకు కేటాయించకపోవటం కాకుండా వంగవీటి రాధాను అక్కడ గెలిపించేందుకు ప్రత్యేక దృష్టి పెడితే సరిపోయేదని అంటున్నారు.
అలా చేయకపోవటం వల్ల కేవలం ఒక్క సీటు కోసం జగన్ పంతంతో వ్యవహరించి…అసలే తమ రిజర్వేషన్ల విషయమై జగన్ వ్యాఖ్యలతో ఆయన పట్ల అసంతృప్తితో ఉన్న కాపులు తాజాగా వంగవీటి రాధా వ్యవహారంతో జగన్ తమకు అనుకూలుడు కాదనే భావనను మరింత పెంచినట్లయిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణగా ఉంది. ఇలా అనేక కీలక విషయాల్లో జగన్ ఏకపక్ష నిర్ణయాలు వచ్చే ఎన్నికల్లోనైనా జగన్ ను విజయ తీరాలకు చేరుస్తాయా?…లేక మరోసారి దెబ్బతినేలా చేస్తాయా?…అనేది కాలమే తేల్చనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?