తన ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు కోసం ఆ పార్టీ అధినేత జగన్ తో చర్చించే బాధ్యతను కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, సీనియర్ నేతలు వినోద్, పల్లా రాజేశ్వర రెడ్డి, శ్రవణ్ కుమార్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. వీరంతా బుధవారం హైదరాబాద్ లో జగన్ తో భేటీ కానున్నారు. మరోవైపు జగన్-కెటిఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ భేటీ పర్యవసానాలు ఎలా ఉండొచ్చనే విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు కోరాలన్న నిర్ణయాన్ని కెసిఆర్ ఈ దశలోనే తీసుకోవడానికి కారణలేమిటనే విషయమై రాజకీయ పరిశీలకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే కోణంలో కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా వైసిపి అనుకూలురు మాత్రం జాతీయ స్థాయిలో జరిపిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైసిపి ఎపిలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెల్చుకుంటుందని వెల్లడైన నేపథ్యంలోనే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని చెబుతున్నారు.
అయితే మరి ఈ తరుణంలో కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు పట్ల వైసిపి అధినేత జగన్ ఎలా స్పందించే అవకాశం ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరును బట్టి చూస్తే కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. కారణం 2014 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ యూపీఏ,ఎన్డీఏ కూటమి బైటే ఉంటున్న జగన్ ప్రస్తుతం ఫెడరల్ ఫ్రంట్తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అందుకు గాను జగన్ ఎపికి ప్రత్యేక హోదా మద్దతుగా లేఖ వంటి కొన్ని షరతులు విధించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఎపిలో తన ప్రత్యర్ధి అయిన చంద్రబాబు ఇప్పటికే యూపీఏ కూటమితో జతకట్టడం, ఇటీవలి తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు తీరుతో కెసిఆర్ ఆగ్రహం చెంది ఆయనను దెబ్బతీయాలనే కృతనిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఆయన సహాయసహకారాలు తనకు కలిసొచ్చే అవకాశం ఉందని భావించడం…వంటి కారణాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో బిజెపికి వ్యతిరేకత ఉన్న పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తుండటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక తన ఫెడరల్ ఫ్రంట్ కు వైసిపి మద్దతు ద్వారా కెసిఆర్ ఏమి ఆశిస్తుండొచ్చనే ప్రశ్నకు సమాధానంగా…వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీల సిద్ధాంతాల కన్నా సీట్ల లెక్కలే కేంద్రంలో అధికారం అనే అంశాన్ని శాసించనున్న విషయాన్ని కెసిఆర్ ముందుగా పసిగట్టారు తదనుగుణంగా పావులు కదపడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో కెసిఆర్ ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బీజేడీ, టీఎంసీ తదితర పార్టీల నేతలను కూడా కలిసిన సంగతి తెలిసిందే.
అలా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలన్న తన ప్రస్తుత ఆకాంక్షకు అనుగుణంగా ఒక్కో అడుగు వేస్తూ మందుకు వెళుతున్న కెసిఆర్ ఎపిలో ప్రతిపక్ష పార్టీ వైసిపికి అనుకూల పవనాలు వీస్తున్నాయనే భావన ఉండటం, పైగా ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాల పట్లే తప్ప జాతీయ రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపని జగన్ మద్దతు తనకు ఎంతగానో కలిసొస్తుందని భావిస్తుండొచ్చు. అందుకే కెసిఆర్ సూచనలతో హైదరాబాద్ లో జగన్ తో సమావేశమవనున్న కేటీఆర్ బృందం జగన్ ను కలసి ఫెడరల్ ఫ్రంట్ దశ-దిశల గురించి జగన్ కు వివరించే అవకాశం ఉంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ కెటిఆర్-జగన్ భేటీ అనంతరం పరిణామాలు ఎలా ఉండొచ్చు?…ఇప్పటికే ముగ్గురు మోడీలు అంటూ మోడీ,కెసిఆర్,జగన్ లపై ధ్వజమెత్తుతున్న చంద్రబాబు ఈ సమావేశాన్ని ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మలుచుకోవడం ఖాయమనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కెసిఆర్ ఫ్రంట్ బిజెపికి మేలు చేయడం కోసమే అని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేసిన మోడీకి వీరు మద్దతుగా నిలుస్తారంటూ తన వాదనను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది.