టీడీపీలోని ముఖ్యులు, మాజీ మంత్రులపై జగన్ ప్రభుత్వం గురి పెట్టింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టే క్రమంలో కొంతమంది మాజీలపై కేసులు పెట్టారు. ఇందులో కొంతమంది జైలుకు వెళ్లి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరిలో అచ్చెన్నాయుడుపై పెట్టిన కొత్త కేసుపై సాక్షాత్తూ ఏసీబీ జేడీ వెలిబుచ్చిన కొన్ని విషయాలను ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీంతో అచ్చెన్నపై కేసు నిలబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై అచ్చెన్న న్యాయపరంగా వెళ్తే ప్రభుత్వమే ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అచ్చెన్నపై ఆరోపణలేంటి.. కేసు ఎంతవరకూ వచ్చిందనేది పరిశీలిస్తే..
అవినీతికి సంబంధించి ఆధారాలతో కాకుండా కేవలం ఆరోపణలతోనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలులో స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ జేడీ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తమ విచారణలో అచ్చెన్నాయుడికి ఎక్కడా నేరుగా డబ్బులు ముట్టినట్టు ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు. విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం మాత్రం ఉందన్నారు. విచారణలో అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరక్కపోతే అనేదే ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. నిజంగానే అచ్చెన్న తప్పు చేశారా అంటే కేవలం సాంకేతికంగా చేసిన తప్పే కనిపిస్తోందని అంటున్నారు. తన వద్దకు వచ్చే పలు కంపెనీలను మంత్రులు సిఫార్సు చేస్తారు. కానీ అచ్చెన్న ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమే ఆయనకు చేటు చేసిందని అంటున్నారు. టెండర్లకు వెళ్లే వాటిపై ఇలా చేయకూడదు కాబట్టే అచ్చెన్నతో పాటు, ఈఎస్ఐ డైరెక్టర్ ను కూడా అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. లక్ష రూపాయిలకు మించిన కొనుగోళ్లలో జరగాల్సిన ఈ-టెండర్లు వందల కోట్ల కొనుగోళ్లలో జరక్కపోవటం, కేటాయింపుల కంటే ఎక్కువ కొనుగోళ్లు జరగడం అచ్చెన్న కొంప ముంచినట్లుగా చెబుతున్నారు.
ఆధారాలు లేకపోతే అచ్చెన్నాయుడు న్యాయపోరాటం చేస్తారా..
తన మీద ఏమీ కేసు నిర్ధారణ కాని పక్షంలో.. తనను అన్యాయంగా ఇరికించారంటూ అచ్చెన్న న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అప్పుడు మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. ఇదే నిజమైతే విచారణ పేరుతో అచ్చెన్నను ఇన్నాళ్లు జైల్లో పెట్టడం సాధారణ విషయం కాదు. ఇదే జరిగితే జగన్ ప్రభుత్వం కక్షపూరతి ధోరణికి వెళ్తోందనే టీడీపీ విమర్శలకు బలం చేకూరినట్టవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన తప్పుని ఏమేర నిరూపిస్తుందో చూడాలి.