ఈ ఏడాది కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ వైరస్ కి సంబంధించిన వ్యాక్సిన్ రాకపోవటంతో భూమి మీద మానవ మనుగడ చాలా కష్టం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. గత నవంబర్ నెలలో చైనాలో బయటపడ్డ ఈ వైరస్ ఈ సంవత్సరంలోనే ప్రపంచ పటం యొక్క ఆకారాన్ని మార్చేసింది. దేశ ప్రధానులు మొదలుకొని సామాన్యుల వరకూ ఈ వైరస్ బారిన పడటం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం లో అంతుచిక్కని వ్యాధి దేశాన్ని మాత్రమేకాక ప్రపంచాన్ని షేక్ చేసింది అనే టాక్ మీడియాలో వినబడుతోంది.
గత శనివారం నుండి ఏలూరు పట్టణంలో చిన్న పిల్లల్లో ఫిట్స్ వచ్చి పడిపోవడం మాత్రమే కాక పెద్దవాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోవటం జిల్లా వైద్య యంత్రాంగాన్ని టెన్షన్ పెట్టించింది. అయితే ఒక్క రోజులోనే దాదాపు కేసులు 300కు పైగా రావటంతో పాటు ఇంకా వస్తూ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా కాక దేశవ్యాప్తంగా ఈ వార్త సంచలనమైంది. ఎందువల్ల ఈ విధంగా జనాలు ఈ వ్యాధికి గురవుతున్నారు అసలు వ్యాధికి మూల కారణం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. పైగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 345 మంది అస్వస్థతకు గురయ్యారని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ప్రకటించడం జరిగింది. అయితే అందులో 160 మంది డిఛార్జి కాగా ఒకరు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. వ్యాధి కారణాలు ఏమిటో తెలియలేదని శాంపిల్స్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక వైరస్ టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చాయని చెప్పుకొచ్చారు. ఐసీఎంఆర్, ఎయిమ్స్ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా ఏలూరు పట్టణానికి రాబోతున్నట్లు తెలిపారు. ఒక ఏలూరు పట్టణంలో మాత్రమే కాక ఈ వ్యాధి లక్షణాలు కలిగి పడిపోతున్న జనాలు చుట్టుపక్కల కూడా రావడంతో.. జిల్లా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.