అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. కోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వానికి జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. సీఆర్డీఏను ఆర్థిక బిల్లుగా వస్తుండడం సరికాదన్నారు. ఇది ఆర్థిక బిల్లు కిందకు రాదని, సీఆర్డీఏ అనేది ప్రత్యేక చట్టమని ఆయన చెప్పారు. ఈ విషయంలో అధికార పార్టీని అడ్డుకొని తీరుతామని యనమల స్పష్టం చేశారు.
కాగా, సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుతో పాటు ఇంగ్లిషు మీడియం తప్పనిసరి, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.