అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను వైసిపి అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పార్టీని రాష్ట్రంలో ఘోరంగా ఓడించినా, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయినా వారిలో ఏ మార్పు రాలేదన్నారు. చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉపన్యాసాలు ఇచ్చి ఏదో జరిగిపోతుందని చెప్పి అసత్య ఆరోపణలతో జగన్ ప్రభత్వంపై బురదచల్లేప్రయత్నం చేస్తున్నారని అంబటి విమర్శించారు. కేవలం నాలుగు తాత్కాలిక భవనాలు కట్టి బ్రహ్మాండమైన రాజధాని కటుతున్నానని చంద్రబాబు ప్రజలను మభ్యపుచ్చారని అన్నారు.చివరకు ఆరోగ్యశ్రీ పధకంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి చెందిన పేద ప్రజల కోసం పక్క రాష్ట్రాలలో కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తుంటే దానిపైనా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇతర రాష్ట్రాలలోని ఆస్పత్రులకు వర్తింప చేస్తే మన ఆదాయం పోతుందని చంద్రబాబు అనడం హస్యాస్పదంగా ఉందన్నారు.
పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడులా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సార్దక నామధేయుడని అన్నారు. మొదటి మాట పవనం, చివరి మాట కల్యాణంకు ఆయన ఎప్పుడో న్యాయం చేశాడని అంబటి వ్యంగంగా వ్యాఖ్యానించారు. జగన్ను పవన్ సిఎంగా గుర్తించకపోతే వచ్చిన నష్టం ఏమీలేదని అన్నారు.మొన్నటి ఎన్నికల్లో పవన్, బిజెపి, తెలుగుదేశం కలిసి పోటీ చేసినా వైసిపి కట్టకట్టి సముద్రంలో పడేసేదని అంబటి పేర్కొన్నారు. రాజదానిలో నడుస్తాను, నడుస్తాను అంటున్నారు ఆయన నడిస్తే ఎమవుతుందని అన్నారు.
పవన్ మాటలు ఎవరికి అర్థం కావడం లేదని అంబటి పేర్కొన్నారు. ‘క్రిస్టియానిటిలో చాలా గొప్పదనం ఉందంటాడు. క్రిస్టియన్ స్కూల్లో తాను చదువుకున్నానంటాడు. భార్య, పిల్లలు క్రిస్టియన్స్ అంటాడు. క్రిస్టియన్స్ చేసే మానవసేవ ఏమతం చేయలేదంటాడు.తిరిగి మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని వైసిపిని అంటారు. హిందూమతం చాలా గొప్పది అంటారు. ఏంటి ఈ కాంట్రావర్సియల్ వ్యాఖ్యలు మాకు అర్దం కావడం లేదు’ అని అంబటి వ్యాఖ్యానించారు.సెక్యులర్ దేశం అయిన భారత్లో అన్ని కులాలు, మతాలు సహజీవనం చేస్తుండగా మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గమని అయన అన్నారు.
పవన్ కల్యాణ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని అంబటి అన్నారు. చంచల మనస్ధత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి వ్యాఖ్యానించారు. ఆయనకు ఏ విషయంపైనా స్దిరత్వం లేదని అన్నారు.