ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం రాజకీయం రోజుకో విధంగా మారుతున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీలో రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అనుచరులకు మరియు వల్లభనేని వంశీ అనుచరులకు మధ్య జరుగుతున్న వివాదాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తాజాగా వల్లభనేని వంశీ, ధుట్టా వర్గీయుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో బాపులపాడు మండలం బాపులపాడు లో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో వల్లభనేని- దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరు నాయకుల ముందే అనుచరులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ గొడవ సద్దుమణిగింది. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో జరుగుతున్న తరుణంలో కార్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఈ తరుణంలో యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై దొంగ ఓట్లతో ఎమ్మెల్యే గెలిచాడని వంశీ పార్టీ లోకి వచ్చాక… అసలు నియోజకవర్గంలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నా కానీ నియోజకవర్గంలో రావడానికి కారణం నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేయకూడదు అని యార్లగడ్డ స్పష్టం చేశారు.
వల్లభనేని వంశీ వైసీపీ కి అద్దె నాయకుడు అయితే నేను అసలు నాయకుడిని..అంటూ పేర్కొన్నారు. జన్మదిన వేడుకలకి వెళ్తుంటే ఆరుసార్లు పోలీసులు ఆపడంతో తీవ్రస్థాయిలో యార్లగడ్డ మండిపడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసు అంటూ వెంకటరావు ఫైర్ అయ్యారు. వంశీ లాంటి నాయకుడు పార్టీలో ఉంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు.
ఏది ఏమైనా గన్నవరం నియోజకవర్గంలో నాయకుల మధ్య జరుగుతున్న వివాదాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. మొన్న దుట్టా వర్గీయులతో తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులతో వల్లభనేని వంశీ వర్గానికి వివాదాలు జరగటం నియోజకవర్గంలో కూడా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో జరుగుతున్న వివాదాల విషయంలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాలని నాయకుల మధ్య సత్సంబంధాలు క్లియర్ అయ్యే విధంగా వ్యవహరించాలని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కోరుకుంటూన్నారు.