Mydukuru: మైదుకూరు Mydukuru మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ లాండ్ సైడ్ విక్టరీ సాధించింది. సీఎం జగన్ పాలనకు గీటురాయిగా ఈ ఎన్నికలు నిలిచాయి. అయితే.. సొంత జిల్లాలోని మైదుకూరులో 24 వార్డులకు వైసీపీకి 11, టీడీపీకి 12, జనసేనకు 1 స్థానం దక్కింది. ఈ సమీకరణాల నేపథ్యంలో మున్సిపాలిటీ పీఠంపై ఆసక్తి నెలకొంది. టీడీపీకి ఒక్క అడుగు దూరంలో అవకాశం ఉంటే.. వైసీపీకీ ఒక్క అడుగే దూరంలో ఉంది. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీ అవినాశ్ ఇద్దరూ అక్కడే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం మైదుకూరులో క్యాంపు రాజకీయాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో వైసీపీ బలం 13కి పెరిగినా.. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే మరొక ఓటు అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి గెలిచిన వారిపై వైసీపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపీకి జనసేనకు ఉన్న వార్ నేపథ్యంలో వైసీపీకి జనసేన మద్దతు ఇచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ ఇచ్చినా మరొకరి మద్దతు కావాల్సిందే. అంటే.. వైసీపీకి ఇద్దరి మద్దతు కావాల్సి వస్తే.. టీడీపీకి ఒకరి మద్దతు సరిపోతుంది. విజయవాడ, ఏలూరుల్లో జనసేన తరపున టీడీపీ నాయకులు వంగవీటి రాధా, చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేశారు. దీంతో టీడీపీకే జనసేన మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ.. వైసీపీ ఈ విషయంలో వెనక్కి తగ్గేలా లేదు.
మున్సిపాలిటీని దక్కించుకోవాలని టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ గట్టి పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ సభ్యుల్లో ఒకరిని వైసీపీ తీసుకెళ్లి బలవంతంగా మద్దతు ఇచ్చేలా చేస్తున్నారని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ఈ నెల 18న జరిగే చైర్మన్ ఎంపికలో వైసీపీకి 14 సభ్యుల బలం కావాలి. అంటే.. జనసేన గెలుచుకున్న సభ్యుడు మద్దతిచ్చినా.. వాళ్లు గైర్హాజరైనా వైసీపీకి చైర్మన్ పీఠం దక్కినట్టే. అలా కాకుండా.. జనసేన అభ్యర్ధి టీడీపీకి మద్దతిస్తే పరిస్థితి టై అవుతుంది. అప్పుడు పరిస్థితి మళ్లీ రసవత్తరంగా మారిపోతుంది. ఇక్కడే వైసీపీ తన గేమ్ ప్లాన్ ను సీక్రెట్ గా అమలు చేసేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. మరి.. 18న ఏం జరుగుతుందో చూడాలి.