అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా పడింది.
పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ కు దాదాపు ఐదు వారాలు సమయం ఉండటంతో పోలింగ్ కు ముందు క్షణం తీరిక లేకుండా గడిపిన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి అధినేత వైఎస్ జగన్ లు వేసవి విడిదికి ప్రాధాన్యత ఇచ్చారు.
చంద్రబాబు నాయడు కుటుంబ సమేతంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి రాగా జగన్మోహనరెడ్డి కుటుంబ సమేతంగా నాలుగు రోజుల పాటు వేసవి విడిదికి స్విడ్జర్లాండ్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. మళ్ళీ జగన్ వారం రోజుల పాటు కుమార్తె వద్ద విడిది చేయడానికి శుక్రవారం లండన్ బయలుదేరి వెళ్లాలని భావించారు. ఈ నెల 12 వ తేదీ తిరిగి లండన్ నుండి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.
అయితే జగన్ లండన్ పర్యటనఫై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెటైర్ వేశారు.
ఒక వైపు రాష్ట్రంలో తుఫాన్ ఉన్న సమయంలో కూడా ప్రతిపక్ష నేత ఫారెన్ టూర్కు వెళ్లడాన్ని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షం ఉన్నా చేసేదేమీ లేదన్న ఉద్దేశంతోనే జగన్ విదేశీయాత్రకు వెళ్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
ఈ నేపధ్యంలో జగన్ లండన్ టూర్ వాయిదా పడింది.
రాష్ట్రంలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగగా మే 23న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.