హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్లో నెలాపదిహేను రోజుల్లో ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. హైదరాబాదులోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతున్నామని టిడిపి అధినేత చంద్రబాబుకు అర్థం అయ్యిందనీ అందుకే ఆయన మాటతీరులో మార్పు వచ్చిందని వ్యాఖ్యానించారు.
చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించడం అప్రజాస్వామికమని చంద్రబాబు అనడాన్ని అంబటి తప్పుబట్టారు. దళితులు ఓటు వేయకుండా అక్కడి అగ్రవర్ణాల వారు అడ్డుపడ్డారని తమ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సాక్షాధారాలతో ఫిర్యాదు చేస్తూ ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరితే ఎన్నికల సంఘం పరిశీలన చేసి ఐదు కేంద్రాలకు రీపోలింగ్ ప్రకటించిందని అంబటి తెలిపారు.
చంద్రబాబుకు ఈవిఎంలపై, ప్రజాస్వామ్యంపై, ప్రజలపై విశ్వాసం లేదంటూ అంబటి విమర్శించారు.