హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా వైసిపి వెంట ఉన్న సమాచారం తెలియడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైసిపి సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. ప్రజలంతా మార్పు కావాలని కోరుకుంటున్నారని ఉమారెడ్డి పేర్కొన్నారు.
జాతీయ సర్వేల నుండి చంద్రబాబు సొంత సర్వేల వరకూ అన్ని టిడిపి ఓడిపోతుందని చెబుతున్నాయని ఉమారెడ్డి అన్నారు. ఓటమి భయం, అభద్రతాభావంతో చంద్రబాబు ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై రగడ చేస్తున్నారని ఉమారెడ్డి విమర్శించారు.
సమీక్షలు పకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే నిర్వహించవచ్చనీ, సాధారణంగా అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు చేయకూడదని ఉమారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు అగౌరవపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఉమారెడ్డి అరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్కు మాత్రమే జవాబుదారీగా ఉంటారని ఉమారెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఏలాగూ అవకాశం లేదు కాబట్టి జాతీయ స్థాయిలో మిగతా నాయకులను ఆకట్టుకునేందుకు, లబ్దిపొందేందుకూ చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.