స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నడూ లేని రీతిగా ఈ మధ్య తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపిపైన, కోర్టు ల పైనా, న్యాయవ్యవస్థపైన, ఓ వర్గం మీడియాపైన ఆయన శైలికి, హోదాకు భిన్నంగా దూకుడుగా స్పందిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధ ప్రవర్తనగా కొన్ని అంశాల్లో చూపుతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఆకస్మికంగా ఆయనలో దూకుడు పెరగడానికి కారణం ఏమిటి?. ధర్మాన ప్రసాదరావు వైసిపి పట్ల అంతర్లీనంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు. పైకి వైయస్ రాజశేఖర్ రెడ్డినీ, వైఎస్ఆర్ సీపీని పొగుడుతూనే ఒ క్కోసారి బాహాటంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. ఇటీవల జిల్లాల విభజన అంశంపైనా జగన్ ఉద్దేశాల కు భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు కూడా ఇటీవల కీలక అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుల మీద, టీటీపీ మీద దూకుడుగా వెళుతున్నారు. ఇలా వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యేలు, కీలక నాయకుల మాటలు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీటికి కారణం ఏమిటి అని విశ్లేషకులు అరా తీస్తే.. అన్నిటికీ కేంద్రం మంత్రి పదవులే అని సమాధానం వస్తుంది. చాలా మంది సీనియర్ ఎమ్మెల్యే లకు ఊరిస్తున్నది మంత్రి పదవులే.
జగన్ క్యాబినెట్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఆ రెండు బిసి సామాజిక వర్గానికి చెందినవి కావడంతో బీసీ లైన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం వీరందరూ ఆశావహ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సందర్భంలో కాపుల కోటాలో కాపులకు కూడా ఇస్తారన్న ఉద్దేశంతో అంబటి రాంబాబు కూడా ఆశిస్తున్నారు. మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, అనంత వెంకట రామిరెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇలా వీళ్ళందరూ పార్టీ పట్ల భక్తిని చాటుకుంటూ ప్రత్యర్థుల పట్ల తమ కోపాన్ని బయట పెట్టుకొంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ మీడియా లో వచ్చేలా చూసుకుంటున్నారు. జగన్ మంత్రి పదవులు ఎప్పుడు ప్రకటిస్తారో ఏమో తెలియదు కానీ ఈ నాయకుల హడావుడి మాత్రం ఇంటా బయటా ఎక్కువ అయింది.