అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
శనివారం మంత్రివర్గ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగా వైసిపి ఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై ఒక నిర్ణయానికి వచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ సమావేశంలోనే మంత్రివర్గంలో స్థానం లభించేవారి పేర్లు వెల్లడి చేయనున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో 25మంది వరకూ తీసుకోవచ్చని తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది.
ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నకల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పునకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలనే దానిపై ప్రధానంగా జగన్ మాట్లాడతారని తెలుస్తోంది.