వైసిపి పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని రాజకీయ పరిస్థితి గుంటూరు జిల్లాలో నెలకొంది. ఈ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరాటం సాగుతోంది. వీరంతా కూడా తొలిసారే పార్లమెంటుకు ,అసెంబ్లీకి ఎన్నికైనవారే కావడం ఇక్కడ విశేషం.
అంతేకాదు…ఇంకా హైలైట్ పాయింట్ ఏమిటంటే ఎంపీలపై ఎమ్మెల్యేలు కాలుదువ్వుతుండడం! ఈ విచిత్రమైన పరిస్థితి బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ బాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలకు ఎదురవుతోంది. నందిగామ సురేష్ బాబు కు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అలాగే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలను చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడుదల రజిని తనదైన శైలిలో తిప్పలు పెడుతున్నారు. బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ బాబు ఉండేది తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఉద్దండరాయునిపాలెం లోనే కావడంతో ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫ్లెక్సీలు తగల బడడం వంటి సంఘటనలు జరిగాయి.
ఎమ్మెల్యేను గణేషన్ మండపాల వద్ద అడ్డుకోవడం కూడా జరిగింది.దీనిపై ఎమ్మెల్యే ఫైర్ అయి ఎం పీ నే నిందించారు.ఎంపీ సురేష్ బాబు సీఎం జగన్ కి సన్నిహితుడు అయినప్పటికీ ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే ఎంపీ సురేష్ బాబు కూడా ఎక్కడ ఎమ్మెల్యే దొరికితే అక్కడ బిగించేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు విషయానికొస్తే ఆయన్ను చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని తిప్పలు పెడుతున్నారు. చిలకలూరిపేట తన సామ్రాజ్యం లాగా రజిని భావిస్తూ ఎంపీ ఊర్లోకి రావటానికి కూడా వీలులేని పరిస్థితి సృష్టిస్తున్నారు. చిలకలూరిపేట పర్యటనకు వచ్చిన ఎంపీ కారుపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేయడం బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఎంపీ కృష్ణదేవరాయలు కూడా ఎమ్మెల్యే విడుదల రజిని ప్రోద్బలంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో అనేక అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా తన పిఎ ఫోన్ పై ఎంపీ తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇద్దరు పోలీసు అధికారుల చేత నిఘా పెట్టించారని ఎమ్మెల్యే రజిని ఆరోపించడమే కాకుండా ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చిలకలూరిపేట లో హాట్ టాపిక్. ఈ పరిణామాలపై వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ స్పందించాల్సిన తరుణం ఆసన్నమైందని వారు అంటున్నారు