అమరావతి: మంగళగిరి రూరల్ మండలం నీరుకొండ గ్రామంలో తన భార్య పేరు మీద అయిదు ఎకరాలు ఉన్నట్లు ఎవరైనా రుజువు చేస్తే ఆ అయిదు ఎకరాలను వారికి రాసి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.నీరుకొండ గ్రామంలో ఆర్కే భార్య పేరున అయిదు ఎకరాల భూమి కొనుగోలు చేశారని టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీరుకొండలో తన భార్య పేరు మీదు అయిదు ఎకరాలు ఉన్నట్లు రుజువు చేయాలని కోరారు. భూమికి సంబంధించిన అఫిడవిట్ కాపీలు చూపితే ఆ భూమిని కనిపెట్టిన వ్యక్తికి రాసి ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణలు వేడుకుంటానన్నారు. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా సమర్పిస్తాననీ, రాజకీయాలకు దూరంగా వ్యవసాయం చేసుకునేందుకు వెళ్లిపోతాననీ ఆర్కే ప్రకటించారు. తనపై ఆరోపణలు చేసిన బొండా ఉమా రుజువు చేయకపోతే క్షమాపణలు కూడా చెప్పాల్సిన అవసరం లేదనీ, ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో పొరబాటున మాట్లాడాననీ చెబితే సరిపోతుందన్నారు. బొండా ఉమా తనపై చేసిన ఆరోపణలకు వాస్తవాలు విచారించకుండా ప్రముఖంగా ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలను తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆర్కే. ఒక వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు దానిపై వివరణ అడగాల్సిన అవసరం లేదా అని ఆర్కే ప్రశ్నించారు. అవాస్తవాలు పేపరులో రాయవద్దని ఆ యాజమాన్యాలకు ఆయన సూచించారు.
మరో పక్క చంద్రబాబు, పవన్ కళ్యణ్పైనా ఆర్కే విమర్శనాస్త్రాలు సంధించారు.
అమరావతిలో లక్షల కోట్ల అవినీతి బైట పడుతుందని కులం పేరుతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆర్కె విమర్శించారు. నీచ రాజకీయాలతో చంద్రబాబు రోజు రోజుకి దిగజారిపోతున్నారన్నారు. రాజధానికి చంద్రబాబు పెద్ద శాపం, రాజధానికి వైయస్ జగన్ వరం అని ఆర్కే వ్యాఖ్యానించారు.ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులను భయపెట్టి వారి నుండి అక్రమంగా భూములు లాక్కోలేదా అని ప్రశ్నించారు. అయిదేళ్లుగా రాజధాని రైతుల్ని దోచుకోవడం తప్ప చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మోసం చేసారు కాబట్టే మంగళగిరి, తాడికొండలలో టిడిపిని ఓడించారని ఆర్కే అన్నారు.రైతులకు ఇచ్చిన హామీలు పాక్షికంగా కూడా చంద్రబాబు అమలు చేయలేదని పేర్కొన్నారు.ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. బినామీ భూముల విలువ పడిపోతుందని చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారని అన్నారు.
అయిదేళ్లు రాజధానిలో అవినీతి జరిగితే పవన్ కళ్యాణ్ ఏమయ్యాడని ఆర్కే ప్రశ్నించారు. రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ ప్యాకేజి తీసుకుని సైలెంట్ అయిపోయారని ఆర్కే ఆరోపించారు. ప్యాకేజీ కోసమే పవన్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాటికొండ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి పెట్టలేదనీ, వామపక్షాలకు, బిఎస్పికి ఇచ్చినా కనీసం వారి గెలుపుకు ప్రచారం కూడా చెయ్యలేదనీ అన్నారు. రాజధాని రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు మోసం చేస్తే, ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ పరోక్షంగా మోసం చేసారని ఆర్కే విమర్శించారు.
రాజధానిపై సిఎం వైయస్ జగన్ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదని అన్నారు. ఈ ప్రాంతంలో భూసేకరణ చట్టాన్ని అమలుచేయవద్దని తాను కోరుతున్నట్లు తెలిపారు. వ్యవసాయం చేసుకోడానికి భూములు కావాలని ఎవరైనా అడిగితే భూములు వెనక్కి ఇచ్చెయ్యమని సిఎంని కొరతానని చెప్పారు. అమరావతిని అగ్రికల్చర్ జోన్గా ప్రకటిస్తే తప్పేముందని అన్నారు. అగ్రికల్చర్ జోన్గా ప్రకటిస్తే స్వాగతిస్తానని ఆర్కే పేర్కొన్నారు.