(చిత్తూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
చెవిరెడ్డి భాస్కరరెడ్డి..ఏపి రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు. వైసిపిలో జగన్కు అత్యంత కంకణబద్దుడైన ఎమ్మెల్యే. టిటిడి బోర్డు 36 మందిలో ఈయనది ప్రత్యేక శైలి. టిటిడి ఏ నిర్ణయం తీసుకున్నా, అధికారులు ఏమి చెప్పినా, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏమి చెప్పినా, మిగిలిన 35 మంది ఒకే, సరే అని తలఊపితే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాత్రం తన సొంత ఆలోచనలను దానిపై రుద్దుతుంటారు. స్థానికుడు కావడం, స్థానిక ప్రజా ప్రతినిధి కావడం, టిటిడిపై పూర్తి అవగాహన ఉండటం వల్ల చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పార్టీలోనూ పట్టు ఉండటం ఇవన్నీ కలిసివచ్చి ఆయన టిటిడి సర్వసభ్య సమావేశాల్లో కీలక సభ్యుడుగా మారుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సమావేశాల్లో ఆయన లేవనెత్తిన అంశాలే ఇందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
చంద్రగిరి ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో పాలకవర్గ సమావేశాలకు హజరవుతూ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారుట. గతంలో టీటీడీ బోర్డు సభ్యుడుగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఉండటంతో బోర్డు సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలపై మాట్లాడుతూ లోపాలను ఎత్తిచూపుతుంటారుట. అయితే సమావేశంలో ఆయన లేవనెత్తిన అంశాలను బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడుతుండగా ఆయన కూడా సమావేశాల విషయాలపై బయట చర్చించడం లేదు. టీటీడి బోర్డు సమావేశాల్లో అజెండాలోని అంశాలలో చెవిరెడ్డి తప్పుఒప్పులను ఎత్తిచూపుతూ మాట్లాడుతుండటం అధికారులకు మింగుడు పడటం లేదట. చెవిరెడ్డి ప్రశ్నల పరంపరకు ఇతర సభ్యులు ప్రేక్షకపాత్ర వహిస్తుండగా అధికారులు సమాధానాలు చెప్పలేక మిన్నకుంటున్నారుట.
సమావేశంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై చెవిరెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో వాటిని పక్కన పెట్టే పరిస్థితి వస్తున్నదట. ఇటీవల జరిగిన సమావేశంలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు ఏడు కోట్ల రూపాయలను కేటాయించాలని ప్రతిపాదించగా అయిదేళ్లుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు అనుమతి లేకుండా టీటీడీ ఎలా నిర్వహిస్తోంది, అయిదేళ్లలో ఉత్పత్తి అయిన సేంద్రీయ ఎరువులను రైతులకు ఉచితంగా పంపిణీ చేయవచ్చు కదా అని చెవిరెడ్డి అధికారులను నిలదీశారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పలేకపోవడంతో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరో విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలో కళ్యాణ మండపం నిర్మాణానికి సంబంధించి అంశంపై చెవిరెడ్డి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. టీటీడి నిధులతో నిర్మించి తిరిగి ఆలయానికి అప్పగించే కళ్యాణ మండపానికి టీటీడీ అద్దె చెల్లించాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని చెవిరెడ్డి ప్రశ్నించారుట. దీంతో ఆ అంశాన్ని పక్కన పెట్టేశారుట. సమావేశంలో ఏ ఒక్క సభ్యుడు మాట్లాడకపోయినా అంశాలన్నింటిపైనా చెవిరెడ్డి మాత్రమే నిర్మోహమాటం లేకుండా మాట్లాడతారని ఆలయ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.
1
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?