రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతల ప్రమాణాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తనపై వచ్చిన అభియోగానికి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇటీవల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది హస్తం ఉందని హతుడి భార్య, టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చౌడేశ్వరి దేవి ఆలయంలో ప్రమాణం చేశారు. సుబ్బయ్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అమ్మవారి సన్నిధిలో ప్రమాణం చేశారు.
గత నెల 29వ తేదీన నందం సుబ్బయ్య ను పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే లే అవుట్ లోనే దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేశారు,. అయితే ఈ కేసులో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే బావమరిది ల పేర్లు చేర్చే వరకూ సుబ్బయ్య అంత్యక్రయలు నిర్వహించేది లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకూ ఆందోళన చేశారు. బుధవారం రాత్రి అక్కడి డీఎస్పీ..నారా లోకేష్, సుబ్బయ్య కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి 15 రోజుల్లో టీడీపీ నేతలు ఆరోపించిన పేర్లను ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. గురువారం మధ్యాహ్నం సుబ్బయ్య అంత్యక్రియలు పొద్దుటూరులో జరిగాయి. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఓ పక్క పోలీసులు ఎమ్మెల్యే రాచమల్లు పేరు ఎఫ్ఐఆర్ లో చేరుస్తామని హామీ ఇచ్చిన తరువాత ఆయన స్వయంగా శుక్రవారం చౌడేశ్వరి దేవి ఆలయానికి చేరుకుని తనకు హత్యతో ఎటువంటి ప్రమేయం లేదని ప్రమాణం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణాలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ప్రమాణాలు చేశారు. ఆ తరువాత విశాఖలోనూ వైసీపీ, టీడీపీ నేతలు ప్రమాణాలు అంటూ ఛాలెంజ్ లు విసురుకున్నారు.