అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కె రోజా స్పష్టం చేశారు.
మంత్రిపదవి దక్కలేదనే మనస్థాపంతో ఉన్న రోజాతో మాట్లాడేందుకు ఆమెను తాడేపల్లి రావాలని ఆ పార్టీ ఎంపి విజయసాయిరెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. నేడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రోజాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తనకు పార్టీ నుండి పిలుపు అంటూ ఏమీరాలేదనీ, రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున వచ్చాననీ తెలిపారు. ‘నాకు చిన్నతనం నుండి కులంపై వ్యామోహం లేదు. నేను పెళ్లి చేసుకుంది బిసిని, నా స్నేహితులు, పని చేసే పిఎ ఇతరులు వివిధ కులాల వారు ఉన్నారు. రెడ్లు ఎవరూ లేరు’ అని రోజా చెప్పుకొచ్చారు.
‘మొదటి నుంచీ కులం గురించి ఆలోచించే అవకాశం రాలేదు, మొదటి సారి కుల సమీకరణలు అంటున్నారు, ఓకే, మంచిదే వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అని రోజా అన్నారు. ‘నా తోటి ఎమ్మెల్యేలందరికీ రావడం ఆనందంగా ఉంది. వారికి నా బెస్ట్ విషెస్ అని’ రోజా చెప్పారు.
మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి గైరుహాజరుపై ప్రశ్నించగా ప్రమాణ స్వీకారం చేసే వారు వస్తారు, అందరూ ఎందుకు వస్తారు అంటూ ఎదురు ప్రశ్నించారు రోజా.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నుండి పిలుపు వస్తే వెళ్లి కలుస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా రోజా చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?