ఎవరెన్ని చెప్పినా.., ఎవరేమి అనుకున్నా జగన్ పాలనలో తిరుగు లేదు..!
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎదురే లేదు..!
జగన్ వచ్చాక ఒక్కో పేద కుటుంబానికి రూ. 50 వేల వరకు లబ్ది అందింది..!
ఓటు వేసినా/ వేయని ప్రతీ పేదకు జగన్ న్యాయం చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలకు న్యాయం చేస్తున్నారా..?
తననే నమ్మి రాజకీయం చేస్తున్న ప్రజాప్రతినిధులకు జగన్ అందుబాటులో ఉంటున్నారా..? అసలు అపాయింట్మెంట్ ఇస్తున్నారా..? ఈ 16 నెలల కాలంలో జగన్ ని కలిసిన ఎమ్మెల్యేలు/ ఎంపీలు ఎందరున్నారు..? అపాయింట్మెంట్ దొరక్క లోలోపల నలిగిపోతున్న ఎమ్మెల్యేలు/ ఎంపీలు ఎందరున్నారు..? అనేదే పేద్ద ప్రశ్న..!!
తెలియని కోటరీ తయారయిందా..!?
తెలుగునాట రాజకీయాల్లో కోటరీ అంటే చంద్రబాబు/ టీడీపీ గుర్తొస్తుంది. బాబు చుట్టూ ఓ కోటరీ చేరి, బాబుకి బిస్కట్లు వేస్తూ… క్షేత్రస్థాయి రాజకీయాన్ని నడిపిస్తుంటుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, నారాయణ, టిడి జనార్దన్ అందుకు ఉదాహరణలు..! అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కి కూడా కోటరీ తయారయింది. పవన్ ని కలవాలి అంటే ముందు నాదెండ్ల మనోహర్, హరి ప్రసాద్, రఫీ వంటివారిని ప్రసన్నం చేసుకోవాలి. ఇదే క్రమంలో కోటరీ లేని నాయకుడిగా జగన్ చాలా కాలం పార్టీని నడిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పంథా మారినట్టే కనిపిస్తుంది. జగన్ ని కలవాలంటే ముందుగా సజ్జల రామకృష్ణ రెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతలను కలవాసి వస్తుంది. వీరిని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. దీనిలో తప్పు లేదు, జగన్ ఉన్న స్థాయి, బిజీలో ఇది తప్పదు.. కానీ..!!
నవ్వు, నమస్తేలకే పరిమితం..!!
వైసీపీ ప్రభత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో జగన్ ని నేరుగా, వ్యక్తిగతంగా కలిసిన ఎమ్మెల్యేలు కేవలం 20 మంది మాత్రమే. ఎంపీలు ఆరుగురు మాత్రమే అంటూ లెక్కలు కూడా వస్తున్నాయి. జగన్ తో బాగా సన్నిహితంగా ఉండే నందిగం సురేష్, మిదున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వంటి వారు మాత్రమే కలుస్తున్నారు. బాల సౌరి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఓ సారి కలిశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు, సీఎం పేషీలో ఎదురయినప్పుడు జగన్ కనిపిస్తే దూరం నుండి చూసి, ఓ నమస్తే పెట్టి వెళ్లిపోయే ఎమ్మెల్యేలు ఎందరో ఉన్నారు. కనీసం వారానికి ఒక ఎమ్మెల్యేకు తనను కలిసే అవకాశం ఇచ్చినా ఇప్పటికే జగన్ కనీసం 75 మంది ఎమ్మెల్యేలు/ ఎంపీలను కలిసే వారు.
సమస్యలు చెప్పుకోలేక సతమతం..!!
సీఎం అంటే ఎమ్మెల్యేల ప్రతినిధి. పార్టీ అధినేత అంటే తమ రాజకీయ ప్రతినిధి. ఇలా ఆ పార్టీలోని 150 మంది ఎమ్మెల్యేలకు జగన్ రెండు వైపులా ప్రతినిధిగా ఉంటున్నారు. పరిపాలన, పార్టీ వ్యవహారాలూ ఆయనకు మాత్రమే చెప్పుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అందుకే చాల మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ అపాయింట్మెంట్ కోసం కాసుకొని కూర్చుంటున్నారు. తమ సమస్యలు చెప్పుకోవాలని, తమ జిల్లాల్లో పార్టీ అంతర్గత వ్యవహారాలు చెప్పుకోవాలని వేచి చూస్తున్నారు.
* నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు… సీఎం జగన్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని రెబల్ గా మారారు అంటున్నారు. ఆయన తరహాలోనే మరో నలుగురు ఎంపీలు జగన్ అపాయింట్మెంట్ కోరి, అవకాశం లేక లోలోపల రగిలిపోతున్నారట. అనేక అంతర్గత విషయాలు చెప్పుకోవాలని, ఆయనతో పని ఉంది అంటూ చాల మంది ఎంపీలు సీఎం అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. కానీ నో యూజ్..!!
* ఎమ్మెల్యేల సంగతి అలాగే ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే ఇప్పటికే మూడు సార్లు సీఎం ని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరి దొరకకపోవడంతో విసిగిపోయారట. నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ ఇదే తరహాలో చాల మంది ఎమ్మీయేలు తమకు సీఎం అపాయింట్మెంట్ లేక.. విలవిలలాడుతున్నారట..!
* ఆయా జిల్లాల్లో మంత్రులు, జిల్లా ఇంచార్జిలకు చెప్పి.., సీఎం గారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని కోరుతున్నా… మాకు చెప్పండి, మేము సర్ కి చెప్తాము అంటూ నొక్కివక్కాణిస్తున్నారట. అందుకే వైసీపీలో ఈ “అపాయింట్మెంట్” రగడ అంతర్గతంగా కొనసాగుతుంది. వారంలో ఓ గంట… టైం చూసుకుని ఒక్కో ఎమ్యెల్యేకు అరగంట కేటాయించినా ఇప్పటికే అందరితో జగన్ ముఖాముఖి మాట్లాడడం పూర్తయ్యేది అంటూ పార్టీలోని కీలక నేతలే చెప్పుకుంటున్నారు. పాలన, సంక్షేమం వంటి అంశాలు దూసుకెళ్తున్న జగన్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇలా అపవాదు మూటగట్టుకోవడం ఆ పార్టీలో కొందరికి మింగుడు పడడం లేదు.