నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయం లో వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. ఆయనను ఎలాగైనా పార్టీ నుంచి సాగనంపుతూనే పార్లమెంటు నుంచి కూడా అనర్హత వేటు వేయాలని పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తాను పార్టీ నుంచి సస్పెండ్ అయిన పర్వాలేదు కానీ ఎంపీ పదవి మాత్రం తనతోనే ఉండేలాగా, పూర్తికాలం పదవిలో ఉండే లాగా తన ప్రణాళికలు తాను వేసుకున్నారు. ఇలా అటు నుంచి వైసీపీ ఎంపీలు రఘు రామ కృష్ణం రాజును అనర్హత వేటు వేసేలా ప్రయత్నాలు, ఇటు నుంచి రఘురామకృష్ణం రాజు తన పదవి కాపాడుకునేలా ప్రయత్నాల నేపథ్యంలో ఇరు వర్గాలు ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రఘు రామ కృష్ణంరాజు మొదటి విడతలో పార్లమెంట్ స్పీకర్ ని, అలాగే కొంత మంది బిజెపి పెద్దలను, ఎన్నికల కమిషనర్ ను కూడా కలిసి తన తరపున వాదనలు వినిపించుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అడుగులు మరింత ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా మారాయి. ఆ క్రమంలోనే ఇద్దరు ఎంపీలు ఢిల్లీకి వెళ్లి రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.
వేటు పడిన వెంటనే రాజు గారు చేసేది ఏమిటంటే..?
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వైకాపా అధిష్టానం ముందుగా రఘు రామకృష్ణంరాజును పార్టీ నుండి సస్పెండ్ చేస్తుంది. ఇలా సస్పెండ్ కు గురైన ఎంపీ నేరుగా బీజెపీ పెద్దలను కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నాల్లో మాత్రం ఉన్నారు. ఇప్పటికే ఆయన అమిత్ షా తోనూ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ ఇతర బీజేపీ పెద్దలతోనూ ప్రాథమికంగా మాట్లాడి తన రాకకు సంబంధించి అన్ని విషయాలు చర్చించినట్టు సమాచారం. అయితే ఈయన వెళుతూ వెళుతూనే వైసీపీపై కొన్ని అభాండాలు, ఎమ్మెల్యేల తీరుపై, ప్రభుత్వ తీరుపై కొంత అంతర్గత సమాచారాన్ని కూడా కేంద్ర పెద్దల వద్ద చేరవేయడానికి ప్రణాళికలు వేసినట్లు తెలిసింది. మరోవైపు వైసీపీ ఎంపీల్లో ఎవరెవరు తనకు వ్యతిరేకంగా లోక్ సభ స్థానం రద్దు అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకొని వారికి స్పీకర్ అపాయింట్మెంట్ దొరకకుండా చేసేందుకు, తన మాట నెగ్గించుకునేలా చేసేందుకు కూడా రఘురామకృష్ణం రాజు ఎత్తులు మీద ఎత్తులు వేస్తున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయం కాస్తా కేవలం ఒక్క ఎంపీ సీటు విషయంలో ఢిల్లీ వరకు చేరింది. వైసీపీలోని ఆట ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కూడా ఆటగా కూడా మారింది. దీనిలో పావుగా మారేదెవరు? ఓడేదెవరు? గెలిచేదెవరు? అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.