(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అమరావతి రాజధాని రెఫరెండంగా రాజీనామాకు సిద్ధం అంటూ వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రఘురామ కృష్ణం రాజు సవాల్ పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించి ముందు రాజీనామా చేయమనండి, రాజధాని విషయంపై నిర్ణయాన్ని తరువాత చెబుతాం అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు స్పందిస్తూ తన రాజీనామాపై మంత్రి బొత్సా సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఇలా ఏపిలో ఎంపి రఘురామ కృష్ణం రాజు, వైసిపి నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్లతో వాడివేడిగా చర్చ జరుగుతోంది.
ఎంపి రఘురామకృష్ణం రాజు స్వపక్షంలోనే విపక్షంగా మారి విమర్శలు చేస్తూ వైసీపీని ఇరుకున పెడుతున్నారు. ముందుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ కు ఎంపి రఘురామ కృష్ణం రాజు ప్రతి సవాల్ విసిరారు. అమరావతి రెఫరెండంగా ఎన్నిక జరిగితే తాను నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు రఘురామ కృష్ణం రాజు. తాను రాజీనామా చేసి నర్సాపురం నుండి ఉప ఎన్నికల్లో నెగ్గితే అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాత పూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధమా అని రఘురామ కృష్ణం రాజు ప్రశ్నించారు. తన ఛాలెంజ్ స్వీకరిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు రఘురామ కృష్ణం రాజు.
వైసీపీ ప్రభుత్వం మాత్రం రఘురామ కృష్ణం రాజు సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా లేదని మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యల బట్టి తెలుస్తోంది. రఘురామ కృష్ణం రాజు రాజీనామా చేసి పోటీ చేయాలనే అంటున్నారు గానీ రాజధాని విషయంపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. వైసీపీకే చెందిన ఎంపి ఇలా అమరావతి రెఫరెండంగా రాజీనామా చేస్తానని ముందుకు రావడం పట్ల అమరావతి ప్రాంత రైతాంగం ఆయన సవాల్ ను అభినందిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విధంగా ముందుకు రాకపోవడం శోచనీయం అని పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?