(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైసీపీ రెబల్ ఎంపి నర్సాపురం రాజు గారి కామిడీ రోజురోజుకు పీక్స్ కి చేరుతోంది. ఢిల్లీ వేదికగా మీడియాతో ఆయన ఏదోదో మాట్లాడుతుండటం, దాన్ని కొన్ని వర్గాల మీడియాలు హైలెట్ చేస్తుండటం ఆయనకు కూడా భలే సరదాగా ఉన్నట్లు ఉంది. అందుకే ఉన్నదీ లేనిదీ అనవసర టాపిక్, లేని అంశాలను, అనవసర అంశాలను, అసందర్భమైన విషయాలను తీసుకువచ్చి మీడియా ముందు పెట్టి సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో రాజకీయాలను దద్దరిల్లిస్తున్నారు, ప్రతి రోజూ మీడియాతో ఏదో ఒక అంశాన్ని మాట్లాడుతూ వైసీపీని, జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో తెలియదు కానీ ఆయన మాత్రం మీడియాకు కామెడీ పీస్ గా దొరికారని ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన ఈ రోజు కూడా ఏమన్నారంటే సాక్షాత్తు పులివెందుల వెళ్ళి జగన్మోహనరెడ్డికి వ్యతిరేకంగా వేలాది మందితో సభ పెడతానని కితకితలు పెట్టారు.
కరోనా తగ్గిన తరువాత తన నియోజకవర్గం నర్సాపురంలోనే కాదు పులివెందులకూ వెళ్లి పదివేల మందితో సభ పెడతానని చెప్పుకొచ్చారు రఘురామ కృష్ణం రాజు. అమరావతి భూములపై పునః సమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడాన్ని ఆయన స్వాగతిస్తూ న్యాయ వ్యవస్థను తప్పుబట్టడం సరికాదని అన్నారు. రాజ్యంగం అంటే ఏపి ప్రభుత్వానికి గౌరవం లేదనీ విమర్శించారు రఘురామ కృష్ణం రాజు. అమరావతి భూముల విషయంపై వైసీపీ ఎంపిలు పార్లమెంట్ ఆవరణలో సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడంపై రఘురామ కృష్ణం రాజు మాట్లాడుతూ ఓ వైపు న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూనే గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు అసెంబ్లీకి లేదన్న కనీస అవగాహన కూడా వీరికి లేదని విమర్శించారు. న్యాయ వ్యవస్థను గౌరవించడం నేర్చుకోవాలని రఘురామ కృష్ణంరాజు హితవు పలికారు.
గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉప సంఘం వేయడం హస్యాస్పదమన్నారు. వైసీపీ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు రఘురామ కృష్ణం రాజు. అవ భూముల కుంభకోణంపై ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న రఘురామ కృష్ణం రాజు అమరావతి భూములపై సీబీఐ విచారణ కోరుతున్న వాళ్లు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై ఎందుకు ప్లకార్డులు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.