నర్సాపురం ఎంపి రాజు గారి సైన్యం రంగంలో దిగిపోయింది. ఇక వైసిపి ఎమ్మెల్యేలు, జగనూ కాసుకోవాల్సిందే. రాజు గారి సైన్యం రావడానికి, వైసిపి కాసుకోవడానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా మరి అక్కడే ఉంది లాజిక్కు,
మ్యాజిక్కు,ఈ రెంటి కలయిక కు ఉన్న రాజకీయం. ఎంపి రఘురామ కృష్ణంరాజు చాలా రోజుల నుండి ఢిల్లీ నుండే రాజకీయాన్ని నడుపుతున్నారు. రోజు ఏదో ఒక్క అంశంపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. తెలుగు మీడియాలోని వైసిపి వ్యతిరేక మీడియాను ఆయన
అనుకూలంగా మార్చుకుని ఆయన ప్రసంగాలు, ప్రెస్ మీట్లు బాగా ప్రచారం అయ్యేలా చూసుకుంటున్నారు. అయితే ఆయన సొంత రాష్ట్రానికి, సొంత నియోజకవర్గానికి వచ్చి చాలా రోజులు అయ్యింది. ఎందుకయ్యా ఆయన రావడం లేదని ఆరా తీస్తే తనకు ఏపిలో రక్షణ లేదని, జగన్ ప్రభుత్వం నుంచి ముప్పు పొంచి ఉందని ఆయన రావడం మానేశారు. అందుకే తనకు రక్షణ దొరికే వరకూ ఎపిలో అడుగు పెట్టనని అక్కడే కూర్చున్నారు. తాజాగా ఏడుగురు అంగరక్షకులు ఆయన భద్రతాదళంగా చేరడంతో ఇక
ఆయన రాష్ట్రంలోకి రంగ ప్రవేశం చేయనున్నారు.
తనకు రక్షణ కల్పించాలని కోరుతూ రామకృష్ణం రాజు కేంద్రంలోని పెద్దలకు వినతి పత్రాలు ఇవ్వడం, హైకోర్టు సైతం ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు సి ఆర్ పి ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించింది. ఈ రక్షణ బలగాలతో ఆయన
హైదరాబాదుకు చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా గోదావరి జిల్లాలోని నదీ తీర గ్రామాలను భారీ వరద ముంచెత్తడంతో రాజు గారి సేన రంగ ప్రవేశం చేసి సహాయ చర్యలు చేపడుతోంది. ఆర్ఆర్ఆర్ (రఘు రామకృష్ణం రాజు) సేన పేరుతో ఆయన అభిమానులు, కార్యకర్తలు నర్సాపురం నియోజక వర్గం లోని ముంపు గ్రామాల్లో
పడవలతో తిరుగుతూ సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ నేత శేషగిరి నాయకత్వంలో గ్రామానికి 500 మంది యువకులు పర్యటిస్తూ బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.
ఒక పక్క జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రఘు రామకృష్ణం రాజు ప్రశంసిస్తూనే ప్రభుత్వంలోని తప్పిదాలను ఎత్తి చూపుతూ విమర్శలు చేస్తూ మరో పక్క తన నియోజకవర్గంలో వరద ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడం గమనార్హం. సహాయం అందుకుంటున్న ముంపు గ్రామాల ప్రజలు మాత్రం రాజు గారి ఔదారాన్ని అభినందిస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ వస్తున్న రాఘు రామ కృష్ణం రాజు స్థానికంగా
సొంత ఖర్చులతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో ఆయన పట్ల సానుకూల వైఖరితో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?