అమరావతి: రాజధాని అమరావతి భూసేకరణకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని భూసేకరణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీలో ఆ మధ్య మీడియా సమావేశంలో ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా నేడు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాజధాని భూసేకరణలో ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారా దోచుకున్న దొంగలంతా ఊచలు లెక్కపెట్టాల్సిందేనని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ రాజధాని లక్షల కోట్ల కుంభకోణం అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పేద రైతుల వద్ద భూములు లాక్కొని కమీషన్లు ఇచ్చిన వారికి ఆ భూములను అణా కాణికి అప్పగించారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. వీటన్నింటిపై ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
చంద్రబాబుకు ట్వీట్ల ద్వారా పలు ప్రశ్నలను సంధించారు.
కొడుకు, కుమార్తెను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ను పార్టీ నుండి బహిష్కరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆ కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుందని విజయసాయిరెడ్డి విమర్శించారు.
గతంలో వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా ఏదో కుట్ర జరుగుతోందని తెగ గింజుకున్న చంద్రబాబు ఇప్పుడు వారంలో రెండు రోజులు అక్కడెందుకు మకాం పెడుతున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్ని జాకీలు పెట్టినా టిడిపి పైకి లేవదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. హెరిటేజ్ వ్యాపారంపై దృష్టి పెట్టేందుకే వెళుతున్న విషయం నిజం కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.