అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె, కుమారుడిపై పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి. తాజాగా కుటుంబ సభ్యుల దోపిడీని ప్రోత్సహించినందుకు కోడెలపై కూడా ఎబెట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.
కోడెల కె ట్యాక్స్ వసూళ్ల పుట్ట బద్దలవుతోందని విజయసాయిరెడ్డి వాఖ్యానించారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బ్రతికే వారిని దోచుకోవడంపై పూర్తి దర్యాప్తు జరుగుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
ఆయన ఆర్టిసి విలీనంపై మరో ట్వీట్ చేశారు.
ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 56 వేల మంది ఉద్యోగులు ఇక నిశ్చింతగా ఉండగలుగుతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గతంలో రైల్వేలను విలీనం చేయడం కంటే ఇది సాహసోపేత నిర్ణయమని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.