అమరావతి: పోలవరం పవర్ హౌస్ పనులకు గతంలో 3455 కోట్ల రూపాయలకు కోట్ చేసిన మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు 2810 కోట్ల రూపాయలకు ఎలా కోట్ చేసిందని మాజీ జలవనరుల శాఖ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించడంపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఉమాతో ఇదే సమస్య, ప్రశ్నలోనే జవాబు కూడా వదులుతాడని విజయసాయిరెడ్డి అన్నారు. గర్జించానని అనుకుంటాడు కానీ ఆ ఆరుపు ‘మ్యావ్’ అన్నట్లు వినిపిస్తుందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం పవర్ హౌస్కు 3455 కోట్ల రూపాయలకు కోట్ చేసిన మెగా ఇప్పుడు 2810 కోట్ల రూపాయలకు ఎలా తగ్గిందని ఆయన అడగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అందులో తమరిద్దరి కమీషన్ ఉందని బయట పెట్టుకోవడం బాగాలేదని విజయసాయిరెడ్డి చమత్కారబాణం విసిరారు.
సుహృధ్బావ వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని నదీ జలాల వినియోగం, విభజన అంశాలపై మాట్లాడితే ఎల్లో మీడియా విషం కక్కిందని విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా ‘సిఎంల అసంతృప్తి’ అంటూ క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు కోసం ఎంత నీచానికైనా మీడియా బానిసలు దిగజారుతారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.