అమరావతి: చంద్రబాబు తనకు తాను గోమాతగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అన్నారు. పాలు ఇచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు అంటూ నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రజాతీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు ఓడిపోయానో తెలియదనడానికి సిగ్గనిపించడం లేదా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పాడి ఆవులాంటి ప్రభుత్వ ఖజానాను పిండుకున్నది తమరు కదా అని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజల నోటికాడ ముద్దను తిన్నది కాక గోమాతగా అభివర్ణించుకోవడం పెద్ద జోక్ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
అవినీతి కేసులు పెట్టకుండా వదిలేస్తే టిడిపిని బిజెపిలో విలీనం చేస్తానని రాయబారాలు పంపింది చంద్రబాబు కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజీలో భాగంగానే నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపించారని ఆయన ఆరోపించారు. ‘ఇంకా మీపైన ఫిర్యాదులు చేస్తారన్న భయమెందుకు? భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోందా?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
‘వైఎస్ఆర్ పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చి పనులు కూడా ప్రారంభించారు. పట్టుదలతో చేస్తే ప్రాజెక్ట్ మూడేళ్లలో పూర్తయ్యేది. ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్తు తయారయ్యేది. ప్రధాని అన్నట్టు దాన్నో ఏటీఎంలా భావించారే తప్ప పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏ కోశానా లేదు.’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.