అమరావతి: వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మరో మారు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు, ‘పచ్చ మీడియా’ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
గతంలో వరదలు, తుఫానులు వస్తే చంద్రబాబు వన్ మ్యాన్ షో నడిచేదనీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కలెక్టర్లపై ఆగ్రహం, సిఎం వచ్చే దాకా కదలని అధికార గణం అంటూ ‘కుల మీడియా’ ‘ఆయనను ఆకాశానికి ఎత్తేదని ఆయన అన్నారు. ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయ చర్యలో పాల్గొంటున్నా, తిట్లు, సస్పెన్షన్లు లేవని విజయసాయిరెడ్డి అన్నారు.
చంద్రబాబు బిజెపిని వదిలి పెట్టాక కుల మీడియా బిజెపిని ఒక విలన్గా చిత్రీకరించిందనీ, మొన్నటి దాకా మోదిని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బిజెపిలోకి దూకుతున్న తరుణంలో ‘ఎల్లో మీడియా’కు పెద్ద చిక్కొచ్చి పడిందన్నారు. ఆ మీడియా రివర్స్ గేర్ వేయక తప్పడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.