అమరావతి, మార్చి 17: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు మారిన నాయకులతో కొందరికే టికెట్ లభించింది. మిగతావారికి నిరుత్సాహమే మిగిలింది. అలా వలసదారులకు టికెట్ దొరికిన చోట ముందునుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నవారు తెల్లమొహం వేయాల్సివచ్చింది.
ఇటీవల కాలంలో అధికార తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, నేతలు వైసిపిలో చేరారు. వీరిలో కొందరిని మాత్రమే అదృష్టం వరించింది. కొందరి పరిస్థితి అయితే రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది.
కొద్ది రోజుల క్రితమే వైసిపిలో చేరిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి గుంటూరు పార్లమెంట్, మాగంటి శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు పార్లమెంట్, రఘురామకృష్ణంరాజుకు నరసాపురం పార్లమెంట్, వంగా గీతకు కాకినాడ పార్లమెంట్, ఆదాల ప్రభాకరరెడ్డికి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాయి.
కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఖరారు చేయడంతో నెల్లూరు వైసిపి ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి, ఒంగోలు వైసిఎం ఎంపి వైవి సుబ్బారెడ్డిలను ఎన్నికలకు దూరం పెట్టాల్సి వచ్చింది.
టిడిపి నుండి వైసిపిలో చేరిన ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు చీరాల అసెంబ్లీ టికెట్ ఇచ్చిన వైసిపి అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ను భీమిలి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అదే విధంగా పర్చూరు అసెంబ్లీ టికెట్ను దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు కేటాయించారు. కాకినాడ ఎంపి తోట నర్శింహం, ఆయన సతీమణి వాణి పార్టీలో చేరగా ఆయన సతీమణి వాణికి పెద్దాపురం అసెంబ్లీ టికెట్ ఖరారు చేశారు.
వైసిపిలో చేరిన అమలాపురం ఎంపి రవీంద్రబాబు, సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు, పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణి, పాణ్యం ఎమ్మెల్యే బుట్టా రేణుక, హాస్య నటుడు ఆలీ, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, జూనియర్ ఎన్టిఆర్ మామ, న్యూస్ ఛానల్ యజమాని నార్నెశ్రీనివాసరావు తదితరులకు మొండి చేయి చూపారు.