అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్లో వంగవీటి రాధా పడ్డారని వైఎస్సార్సిపి అధికార ప్రతినిధి పేర్ని నాని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణలకు వైసిపి అధినేత వైఎస్ జగన్ అడ్డు చెప్పలేదని అన్నారు. వైసిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ ఆహ్వానం అందుకున్న మాజీ ఎమ్మెల్యే రాధా జగన్పై చేసిన ఆరోపణలకు నాని కౌంటర్ ఇచ్చారు.
రాధాకు ఇష్టం లేకుండా జగన్ ఏనాడూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అందుకు తానే సాక్ష్యమని చెప్పారు.
బుర్ర నిండా కుట్రలు ఉన్న చంద్రబాబును నమ్మవద్దని ఆయన రాధాను విజ్ఞప్తి చేశారు.
నక్కజిత్తుల మారి చంద్రబాబు మాయలో పడవద్దని ఆయన అన్నారు. పేదల కోసం , రాధా-రంగ అనుచరుల కోసం మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.
రాధా నిర్ణయం వైసిపి నేతలకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా బాబు..క్రూరమైన ఆలోచనలు కలిగిన చంద్రబాబు ప్రలోభాలకు ఎలా లొంగాడా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నక్కకు కుందేలు దొరికిందా అని రంగా అభిమానులు బాధపడుతున్నారని ఆయన అన్నారు.
వైసిపిలోకి రాధా చేరినసమయంలో రాముడు లక్ష్మణున్ని చూసినట్లు చూసుకుంటానని జగన్ చెప్పారని నానీ అన్నారు.
రంగా విగ్రహం ఆవిష్కరణకు వెళ్లవద్దని జగన్ చెప్పాడని రాధా అనడం సత్యదూరమని ఆయన అన్నారు.
రంగా యశస్సు చాలా గొప్పదని చెప్పారు. రంగా విగ్రహాల ఆవిష్కరణకు ఏనాడు వైసిసి అదినేత అడ్డు చెప్పలేదన్నారు. వైసిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాధా ఉండి రంగా విగ్రహాల ఆవిష్కరణలకు వెళ్ళేటప్పుడు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలను కలుపుకుని వెళ్ళాలని జగన్ సూచించారని ఆయన చెప్పారు.
ఎమ్మెల్యేలకు విలువలేని చోట ఉండలేనని అనడం సరైందికాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీలకు ఎటువంటి పనులు చేయకుండా చంద్రబాబు అడ్డుకోవడం అతని రాక్షస పాలనకు నిదర్శనమనీ, వైసిపి అధికారంలో వచ్చిన తర్వాత పేదలకోసం అన్ని పధకాలు అమలుచేద్దామని జగన్ చెప్పారనీ ఆయన అన్నారు.
రంగా హత్యకు తెలుగుదేశంపార్టీకి సంబంధంలేదని అనడం బాధకలిగించిందని ఆయన చెప్పారు.
రంగా హత్యకు వెనుక టిడిపి ఉందని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని ఆయన అన్నారు. రంగా చనిపోయినప్పడు తెలంగాణలో రంగా అభిమానులు తెలుగుదేశం గూండాలు చంపారంటూ ఒక పాట పాడారని ఆయన పాటను గుర్తు చేశారు. ఆ పాట అలా ఎందుకు పాడారని ఆయన ప్రశ్నించారు.
దేవినేని నెహ్రూ మరణించకముందు వైసిపిలో జాయిన్ అయ్యేవారని, రాధా చేర్చుకోవడానికి అడ్డుపడటంతో నెహ్రూను పార్టీలో చేర్చుకోలేదని ఆయన చెప్పారు. ఆ నాడే నెహ్రూను చేర్చుకునేంటే మీకు పొగపెట్టనట్లే కధా అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడైన రాధా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.