అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు నిత్యం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తల్లోనే ఉంటున్నారు. రఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి నేతృత్వంలో ఎంపిల బృందం స్పీకర్ ఒంబిల్లాకు ఫిర్యాదు అందజేసిన తరువాత ఆయన మరింత దూకుడుగా వెళుతున్నారు. ఢిల్లీలో కూర్చుని సొంత పార్టీ ప్రభుత్వంపైనే రాళ్లు వేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం ఆయనపై ఇంత వరకూ బహిష్కరణ వేటు వేయలేదు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై తనకు ఎంతో గౌరవం ఉంది అంటూనే నిత్యం ప్రభుత్వ విధానాలను తూర్పారపడుతూ రచ్చ కొనసాగిస్తున్నారు.
అమరావతి రైతులకు నూటికి నూరు పాళ్లు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. న్యాయం పూర్తిగా అమరావతి రైతుల పక్షాన ఉందని, న్యాయస్థానాల ద్వారా వారికి న్యాయం లభిస్తుందని అన్నారు రఘురామకృష్ణంరాజు. కోర్టుల్లో వాదనలకు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చిస్తుందని విమర్సించారు. ప్రజా ధనం వృధా చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు రఘురామ కృష్ణంరాజు. ముఖ్యమంత్రి జగన్ కు న్యాయపరమైన విషయాల్లో సలహాలు ఇచ్చే వారు లేరనుకుంటా, ప్రస్తుతం ఉన్న సలహాదారులను తొలగించి న్యాయసలహాదారులను పెట్టుకుంటే మంచిదని సిఎం జగన్ కు సూచించారు రఘురామకృష్ణంరాజు. వైసిపిలోని కొందరు తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారనీ, తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే ఇటీవల వచ్చిన మెజార్టీ కంటే మూడు రెట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంపై ఆయన మాట్లాడుతూ చిత్రవిచిత్రమైన బ్రాండ్ లు అన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే అమ్ముతున్నారనీ ఇలాంటి బ్రాండ్ లు తాగితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. సొంత పార్టీ ఎంపినే రోజు ప్రభుత్వాన్ని, సిఎం జగన్ ను విమర్శించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో తనకు సొంత పార్టీ నాయకులతోనే ఇబ్బందులు ఉన్నాయనీ, తనకు రక్షణ కల్పించాలని కోరి మరీ కేంద్ర ప్రభుత్వ బలగాలతో రక్షణ కూడా పొందారు. రఘురామ కృష్ణంరాజు. అయితే రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ పార్లమెంటరీ నేతల బృందం చేసిన ఫిర్యాదుకు స్పీకర్ ఎటుంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో రఘురామకృష్ణం రాజు కోర్టునూ ఆశ్రయించారు. రఘురామకృష్ణం రాజును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేస్తే ఇక్కడ టిడిపి నుండి సస్పెండ్ కు గురై అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడుగా ఉన్న వల్లభనేని వంశీ మాదిరిగా పార్లమెంట్ లో రఘురామకృష్ణం రాజు ప్రత్యేక సభ్యుడు అవుతారని ఆయనపై అనర్హత వేటు సాధ్యపడదేమో అన్న సంశయంతో పార్టీ ఉన్నట్లు సమాచారం. తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష నాయకుల మాదిరిగా విమర్శల పరంపర కొనసాగిస్తున్న రఘురామకృష్ణం రాజును పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎలా కట్టడి చేయనున్నారు. అసలు రఘురామకృష్ణ రాజు వ్యూహం ఏమిటి, ఏ ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు అనే విషయాలు పరిశీలకులకు అర్థం కావడం లేదు. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూద్దాం.