(“న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు సొంత పార్టీ నేతల నుండే బెదిరింపులు వస్తున్నాయట. తోలు తీస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఈ బెదిరింపులపై ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు.
గత కొంత కాలంగా రఘురామ కృష్ణం రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో మారు రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ను కోరతామని వైసీపీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి రెండు రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు మరో మారు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొందరు వ్యక్తులు తనకు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు రఘురామ కృష్ణం రాజు. తన తోలు తీస్తాం అంటున్న వ్యక్తులు సమయం చెబితే…తానే వాళ్ల వద్దకు వెళతానని అన్నారు. తన సొంత నియోజకవర్గంకు వెళ్లడానికి ఎటువంటి భయం లేదని పేర్కొన్న ఆయన తాను నియోజకవర్గంలోకి వెళితే వేల మంది అబిమానులు వస్తారని, ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నందు వల్లనే తాను నియోజకవర్గానికి వెళ్లడం లేదని చెప్పుకున్న రఘురామ కృష్ణం రాజు.
ముఖ్యమంత్రి జగన్ చుట్టూ కొందరు వ్యక్తులు చేరి నటిస్తున్నారని విమర్శించారు. వారిని నమ్ముకుని జగన్ పదవులు ఇస్తున్నారనీ, అటువంటి వ్యక్తులను జగన్ గుర్తిస్తే పార్టీకి మంచి జరుగుతుందని సూచించారు రఘురామ కృష్ణం రాజు. మంచివాళ్లు ఎవరో, నటించే వాళ్ళు ఎవరో గుర్తించే శక్తిని భగవంతులు సీఎం జగన్కు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
సిఎం జగన్ను కలిసే అర్హత తనకు లేదనీ కొందరు అంటున్నారనీ, అయినా తనకు ఎటువంటి బాధ లేదని అన్నారు రఘురామ కృష్ణం రాజు. సిఎం పేరు చెప్పుకొని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనీ, అటువంటి వారితో సీఎం జగన్ జాగ్రత్తగా ఉండాలని రఘురామ కృష్ణం రాజు హితవు పలికారు.