వైసీపీలోని ఓ మంత్రి అవినీతి అక్రమాల వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన అక్రమాలపై ద్వితీయ శ్రేణి నాయకులు ఏకంగా పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ కు లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుండి సదురు నేత సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నాడన్నది వారి ఆరోపణ. వైసీపీ కోసం పని చేసిన వారిని పక్కనపెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు, కాంట్రాక్ట్ పనుల్లో తన సొంత వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఏకరువు పెడుతున్నారు.
మూడు రోజుల క్రితం ఆ నియోజకవర్గంలో మంత్రి వ్యవహారశైలిపై విసుగెత్తిన పార్టీ సీనియర్లు పలువురు సమావేశం నిర్వహించి మంత్రి తీరుకు ఎలా చెక్ పెట్టాలో చర్చించుకున్నారుట. పార్టీ అధిష్టానానికి లేఖలు రాయాలని నిర్ణయించుకున్నారుట. మంత్రి తీరు కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని సమస్య లన్ని లేఖలో పేర్కొనాలని భావిస్తున్నారు ట.
వైసీపీ గెలుపు కోసం శ్రమించిన వారిని పక్కనపెట్టి.. మంత్రి తన బినామీలు, అనుచరులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ వారు విమర్శిస్తున్నారు.సదురు మంత్రి కోసం ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నాయకుడికి కార్పొరేటర్ టికెట్ కూడా దక్కకుండా చేయాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని సదురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నియోజకవర్గం లో 22 డివిజన్ లు ఉండగా నాలుగు మినహా మిగిలిన 18 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్లు ఇవ్వడంతో ఓ వైసీపీ సిట్టింగ్ కార్పొరేటర్ టికెట్ దక్కక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల నియోజకవర్గంలో పార్టీ దెబ్బతింటోందని వారంతా ఆందోళన చెందుతున్నారుట. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి సమాయత్తమవుతున్నారు.
మంత్రి గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కొక్క సీటును ఏకంగా రూ.15 నుంచి 30 లక్షల వరకు అమ్ముకున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. నలుగురు ఐదుగురు బినామీలను ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో అక్రమాలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. వీరంతా అధిష్టానానికి లేఖలు రాయాల నీ, అప్పటికి స్పందించకపోతే నేరుగా కలవాలని భావిస్తున్నారుట. అయితే మంత్రిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించిందనీ, పూర్తి వివరాలు సేకరిస్తోందనీ అనుకొంటున్నారు.