YCP TDP: వైసీపీ, టీడీపీ మధ్య ఎన్ 440 కే వైరస్ అంశం రగులుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై గుంటూరు జిల్లాలో మరో కేసు నమోదు అయ్యింది. న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ ఫిర్యాదుతో అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని పచ్చల అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనిల్ కుమార్ ఫిర్యాదుతో చంద్రబాబుపై 188, 505(1)బీ, 505(2) సెక్షన్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇంతకు ముందు ఇదే అంశంపై న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదుతో కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై ఐపీసీ 155, 505(1)బి, 505(2) జాతీయ విపత్తుల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుపై కేసు నమోదు చేసిన అనంతరం ఇవే వ్యాఖ్యలు మంత్రి సీదిరి అప్పలరాజు చేశారంటూ టీడీపీ నేతలు కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మళ్లీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో జయన్న అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. మంత్రి అప్పలరాజుపై తక్షణం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై అటు కర్నూలు, ఇటు గుంటూరు జిల్లాలో రెండ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి.
మంత్రి అప్పలరాజుపైనా కర్నూరు జిల్లాలోనే రెండు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. ఓ పక్క రాష్ట్రంలో కరోనా రెండవ దశ విజృంభిస్తున్న వేళ టీడీపీ, వైసీపీ మధ్య కేసు, కౌంటర్ కేసుల రాజకీయం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. తొలుత కర్నూలులో చంద్రబాబుపై కేసు నమోదు అయిన సందర్భంలో చంద్రబాబుకు నోటీసులు జారీ చేస్తామని అక్కడి ఎస్పీ ప్రకటించారు. అయితే మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో చంద్రబాబుకు పోలీసులు నోటీసులు జారీ చేసే విషయంలో తాత్సారం చేస్తున్నారు.