(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఏపి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించుకొని గట్టెక్కేందుకు ప్రయత్నిస్తుండగా, కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారు. అయితే ఇదే సందర్భంలో దేశ వ్యాప్తంగా బిజెపి రాజకీయ అభిమానులను, రాజకీయ ఆశక్తులను తమ వైపు తిప్పుకుంటున్నా ఏపికి చెందిన ఎంపిలు మాత్రం ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేశారు. పార్లమెంట్లో ఏపిలో జరిగిన రాజకీయాలను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తేందుకు వ్యూహాలకు పదును పెట్టారు. రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని గట్టిగా పట్టుకోవాలని వైసీపీని ఇరుకున పెట్టేలా పార్లమెంట్లో మాట్లాడాలని టీడీపీ వ్యూహం అమలు చేస్తుండగా, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, సీబీఐ కేసులను, మూడు రాజధానుల ఉపయోగాలను పార్లమెంట్ సాక్షిగానే లేవనెత్తాలని వైసీపీ భావిస్తోంది.
టీడీపీ లెవనెత్తే అంశాలు, వ్యూహాలు ఇవే
వైసీపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని తొలి నుండి టీడీపీ వ్యతిరేకిస్తున్నది. అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని టీడీపీ పేర్కొంటున్నది. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి, కుంటుపడిన అభివృద్ధి, రాష్ట్రంలో అమలు అవుతున్న అప్రజస్వామిక విధానాలను కేంద్రం దృష్టికి తీసుకురావాలని టీడీపీ భావిస్తున్నది. వైసిపి హయాంలో జరుగుతున్న అవకతవకలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనీ, అక్రమ కేసుల బనాయింపు తదితర విషయాలపై గళమెత్తాలని టీడీపీ వ్యూహాలను సిద్ధం చేసుకున్నది.
వైసీపీ ఆస్త్రాలు ఇవి.. సిద్దమయ్యాయి
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోందని పేర్కొంటూ మూడు రాజధానుల వల్ల ప్రయోజనాలను, గత ప్రభుత్వంలో అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా జరిగిన అవినీతి అక్రమాలను కేంద్రం దృష్టికి తీసుకురావాలని వైసీపీ ఎంపిలు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని పార్లమెంట్లో పట్టుబట్టాలని వైసీపీ నిర్ణయించుకున్నది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాకుండా టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు కేంద్రం దృష్టికి తీసుకురావాలని, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రాన్ని అభ్యర్థించాలని వైసీపీ భావిస్తున్నది. రాష్ట్రంలో టీడీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ వివాదంగా సృష్టించి అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టాలని చూస్తున్నది వైసీపీ.