కడప: హత్యకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి రాసినట్లు చెబుతున్న లేఖ మిస్టరీ వీడడం లేదు. అది పోలీసుల సృష్టేనని నిన్న వైఎస్ జగన్ ఆరోపించారు. వివేకా మరణవార్త తెలిసిన వెంటనే తాను అక్కడికి వెళ్లినపుడు ఎలాంటి లేఖా లేదని కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి అంటున్నారు. ఆ లేఖను తమకు వివేకా కుటుంబసభ్యులే ఇచ్చారని కడప ఎస్పి స్పష్టం చేస్తున్నారు. లేఖ ఎవరు రాశారో తేలితే వివేకా హత్య మిస్టరీ తేలిపోతుందని భావిస్తున్నారు.
శనివారం అవినాష్ రెడ్డి వివేకా మృతిపై కడపలోని వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వివేకా మృతదేహం వద్దకు తాము వెళ్ళినప్పుడు ఎలాంటి లేఖ దొరకలేదంటూ, అది ఎలా వచ్చిందో పోలీసులే తేల్చాలని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
హత్య విచారణలో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
వివేకా చనిపోయాడని ఆయన బావమరిది శివ ప్రకాష్ రెడ్డి చెబితేనే తనకు తెలిసిందని అవినాష్ రెడ్డి అన్నారు. తను వెళ్లే సమయానికి పోలీసులు సంఘటనా స్థలంలో లేరనీ, తానే స్వయంగా వారికి సమాచారం అందించాననీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
మృత దేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసుల్ని కోరినట్లు అవినాష్ రెడ్డి తెలిపారు. అలాగే పోస్ట్ మార్టం చేయకముందే శవ పంచనామా చేయాలని చెప్పానన్నారు.
వివేకా మృతి సహజ మరణం కాదనీ, మృతి పట్ల అనుమానాలున్నాయనీ తాను ముందే పోలీసులకి, మీడియాకి చెప్పానని అవినాష్ రెడ్డి అన్నారు. గుండె పోటు అని తాము ఎక్కడా ఎవరికీ చెప్పలేదనీ, మీడియాలో వచ్చిన కధనాలు కేవలం కల్పితమేనని అవినాష్ రెడ్డి అన్నారు. అల్లర్లు జరుగుతాయనే కాస్త సంయమనం పాటించామని తెలిపారు.
‘ప్రభుత్వం ఎన్నో సార్లు సిట్ వేసింది. కానీ ఎక్కడా బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా సిట్ ద్వారా న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు. అందుకే వివేకా హత్యపై సిబిఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని’ అవినాష్ రెడ్డి వివరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?