YS Jagan: వైసీపీ ప్రభుత్వం అనేక అంశాల్లో పూర్తిగా కేంద్రంపైనే ఆధారపడుతుంది.. విభజన తర్వాత రాష్ట్రానికి ఎదురైనా పరిస్థితుల నేపథ్యంలో అలా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. మధ్యలో ఏపీలో రాజకీయ రగడ ఎక్కువవ్వడం.., అధికార, విపక్షాల మధ్య చీటికీ మాటికీ వాగ్వాదాలు కాస్త హెచ్చుమీరుతుండడం.. కోర్టుల జోక్యం ఎక్కువవడంతో ఒకరకంగా జగన్ ఒంటరిగా అయిపోయారన్న భావన కొందరిలో మెదులుతుంది. ఈ క్రమంలోనే అడపాదడపా కేంద్రం నుండి జగన్ కి శుభవార్తలు వస్తున్నాయి. నిధుల సాయం సహా రాజకీయంగానూ వివిధ అంశాల్లో కేంద్ర పెద్దల నుండి సీఎం జగన్ కి గుడ్ న్యూస్ లు అందుతుంటాయి. ఈ క్రమంలోనే నిన్న ఒకటి, ఈరోజు ఒకటి వరుసగా రెండు రోజుల్లో రెండు శుభవార్తలు అందడంతో వైసీపీ హుషారుగా ఉంది. టీడీపీకి మాట రావడం లేదు. ఇక కేంద్రం మద్దతు మాకే అనే దిశలో వైసీపీ పూర్తిగా వెళ్ళిపోయింది..!
YS Jagan: అమరావతిపై మరోసారి..!
ఏపీ రాజధాని ఏది అనే ప్రశ్నపై మరోసారి కేంద్రం కుండబద్ధలు కొట్టింది. ఈ మేరకు రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ స్పందించారు. “రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదు” అని బదులిచ్చారు. గతంలో కూడా పలు సందర్భాల్లో కేంద్రం నుండి ఇటువంటి సమాధానాలే వచ్చాయి. అంటే ఏపీ రాజధాని వికేంద్రీకరణ విషయంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒక స్పష్టతతో ఉన్నప్పటికీ.. ఏపీలో రాజకీయం కోసం బీజేపీ నేతలు కొన్ని డ్రామాలాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజధాని వికేంద్రీకరణ జరిపి తీరుతామని మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.
అప్పులపై.. కేంద్రమంత్రి..!!
ఇక వైసీపీ ప్రభుత్వానికి మరో శుభవార్త కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ద్వారా వచ్చింది. ప్రస్తుతం దేశంలో రాష్ట్రాల అప్పుల వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో విపక్షాలు విమర్శించాలన్నా.., జగన్ ని టార్గెట్ చేయాలన్నా అప్పుల కుప్పగా మార్చేస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే నిన్న బడ్జెట్ ప్రసంగం ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ చాలా స్పష్టంగా చెప్పారు. దేశం కూడా అప్పుల్లో ఉందని.. రానున్న ఆర్ధిక సంవత్సరంలో రూ. 17 లక్షల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నందున అప్పు చేయాల్సి దేశం అప్పులతో పోలిస్తే రాష్ట్రం చేస్తున్న అప్పు పెద్ద లెక్కేమే కాదు అనే వాదనని వైసీపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే సందర్భంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, యూపీ, కర్ణాటక కూడా భారీగా అప్పులు చేస్తున్నాయని.. వైసీపీ నేతలు సమర్ధించుకుంటున్నారు. సో.. అటు అమరావతి, ఇటు అప్పుల వ్యవహారంలో కేంద్రం నుండి వైసీపీకి స్పష్టమైన సానుకూల సమాధానాలే దొరికాయన్నమాట..!