వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ యాత్ర ఈరోజు శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజుల్లో ఆయన మొత్తం 3,648 కిలోమీటర్లు నడిచారు. ఈ యాత్ర సందర్భంగా జగన్ 2,500కు పైగా గ్రామాలు, పట్టణాలు దాటారు.
ఇది చిన్న విషయం కాదు. చెప్పుకోదగిన ఘనతే. రానున్న ఎన్నికలలో విజయం లక్ష్యంగా జగన్ ఈ యాత్ర నిర్వహించారు. గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేశారు. దానికీ, ఇప్పుడు జగన్ చేసిన పాదయాత్రకూ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ను గెలిపించడం లక్ష్యంగా వైఎస్ఆర్ ఆ యాత్ర చేపట్టారు. అంతకు ముందు 1999 ఎన్నికలలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు. కానీ గెలిపించలేక పోయారు.
నిజానికి ఆ ఎన్నికల ముందు వాతావరణం కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని అంతా భావించారు. పార్టీ గెలుపు ఖాయమనీ, తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లేననీ రాజశేఖర రెడ్డి కూడా భావించారు. చివరకు ఆశాభంగం తప్పలేదు. 2004 ఎన్నికలలో విజయం సాధించక పోతే కష్టమని వైఎస్కు తెలుసు. అందుకే ఆయన ప్రజాప్రస్థానం యాత్ర చేపట్టారు. దిగ్విజయంగా యాత్ర ముగించి తర్వాత ఎన్నికలలో పార్టీని విజయతీరాలకు నడిపించారు.
జగన్మోహన్ రెడ్డి కూడా 2014 ఎన్నికలలో గెలుపు తమదేనని గట్టిగా నమ్మారు. చివరకు విజయం టిడిపిని వరించింది. తండ్రి లాగా ఇప్పుడు గెలవకపోతే తనకూ కష్టమని జగన్కు తెలుసు. అందుకే ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారు. 2004 నాటి వైఎస్కు 2019 నాటి జగన్కూ మధ్య ఒక తేడా ఏమంటే ఎంత కష్టపడి గెలిపించినా కాంగ్రెస్లో వైఎస్కు సిఎమ్ పదవి లభిస్తుందన్న హామీ లేదు. జగన్కు ఆ ఇబ్బంది లేదు. పార్టీయే ఆయన సొంతం.
2014 ఎన్నికలలో పరాజయం తర్వాత జగన్ తన పార్టీని కాపాడుకోగలిగారు. అది ఆయన ఘనత కిందే చెప్పుకోవాలి. నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ మొదటి ఎన్నికలలో గెలవకపోతే తర్వాత దాని మనుగడ కొంచెం కష్టమే. అయితే విభజనానంతర ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయి మరో ప్రతిపక్షం అనేది లేకపోవడం జగన్కు కలిసివచ్చింది. అధికారపక్షం ప్రలోభాలకు లొంగిపోయి చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా జగన్ ధైర్యంగా ముందుకు నడిచారు. మొత్తం మీద పార్టీ బేస్ తగ్గకుండా చూడగలిగారు.
పార్టీ బేస్ తగ్గకుండా ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సిపి రానున్న ఎన్నికలలో విజయం సాధిస్తుందని చెప్పడం కుదరదు. తటస్థంగా ఉండే వోట్లు ఏమాత్రం లభిస్తాయన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుంది. జగన్పై అవినీతి కేసులు విచారణలో ఉన్నాయ. వాటిలో ఒక్కదానిలో శిక్ష పడినా ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా జగన్ పార్టీని మెజారిటీ వోటర్లు బలపరుస్తారా అన్నది ప్రధానమైన ప్రశ్న. వారంవారం కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే వ్యక్తి ముఖ్యమంత్రా అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అంటూ ఉన్నారు.
ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల నిర్వహణ ఒక ఎత్తు. ఆ విషయంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని అందరికీ తెలుసు. జగన్ క్రితం సారి ఎన్నికలలో డబ్బు బయటకు తీయలేదు. ఈసారి కూడా తీస్తారో లేదో తెలియదు. టికెట్ ఇవ్వాలంటే అభ్యర్ధుల నుంచి జగన్ పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆ మధ్య టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఒక సభలో చెప్పిన మాట సంచలనం సృష్టించింది. ఎంతటి ప్రజాకర్షక నాయకుడైనా ఇవాళ ఎన్నికలలో డబ్బు లేందే ఏమీ చేయలేడనే విషయం సర్వవిదితం. అయిదేళ్ల క్రితం లానే ఇప్పుడు కూడా జగన్ చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అంతవరకూ ఓకె. అది మితి మీరితేనే కష్టం