బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా కనిపిస్తే 100 రూపాయలు అర్బన్ ప్రాంతాల్లో 50 రూపాయలు రూరల్ ప్రాంతాల్లో ఫైన్ అని చెప్పింది ప్రభుత్వం.
మరి దీన్ని అధినేతలే పాటించకపోతే ?వీటిని ఎవరైనా పాటించకపోతే ఆక్షేపణ లేదు కానీ ప్రజా నాయకులుగా, పాలకులుగా ఉన్నవారు ఆచరించకపోతే సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందన్న చర్చ ప్రస్తుతం ఎపి లో నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్క్ ధరించకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన చుట్టూ ఉండేవారు సామాజిక దూరం కూడా పాటించకపోవడం విమర్శలకు దారి తీస్తుంది.
ఎపి సిఎం వైఎస్ జగన్ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సందేశం అయితే ఇస్తున్నారు తప్ప అవి తానూ పాటించి చూపలేకపోతున్నారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ వంటివారు జగన్ కు ఇదే విషయం పై హెచ్చరించారు కూడా. దీనికోసం ఆయన భగవద్గీత లో శ్లోకం కూడా చదివి వినిపించి ఉత్తములు దేనినైతే ఆచరిస్తారు లోకం దాన్ని అనుసరిస్తుందని కనుక సిఎం ఈ విషయంలో అందరికి ఆదర్శంగా ఉండాలని కోరారు.ఆ తరువాత జగన్ 108, 104 అంబులెన్స్ ల ప్రారంభ కార్యక్రమంలో మాస్క్ పెట్టుకుని కనిపించారు. ఇక ఆ తరువాత మళ్ళీ మాములు అయిపోయారు. చివరికి పెద్ద జనసముహంతో సాగిన వైఎస్ జయంతి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కానీ అక్కడా ఆయన ఈ నియమం పాటించలేదు.అదే విమర్శలకు తావిస్తోంది.
జగన్ ఏమైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ఫాలోఆవుతున్నారా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.ప్రపంచంలో కరోనా కేసుల్లో యుఎస్ నెంబర్ వన్ స్థానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో మూడో స్థానంలో భారత్ ఉన్నాయి. అయితే ట్రంప్ మొదటినుంచి మాస్క్ ధరించకుండా తిరుగుతూనే ఉన్నారు. తాను మాస్క్ ధరించనని కూడా తెగేసి చెప్పి విమర్శల పాలయ్యారు.మన ముఖ్యమంత్రి జగన్ ఎందుకని మాస్క్ ధరించరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!ఏదేమైనా చెప్పేవారు చేసి చూపితే బాగుంటుందన్నది విజ్ఞుల సలహా.