YS Jagan: వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేరు చెప్పగానే ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు “మాట తప్పుడు, మడమ తిప్పడు” అని గర్వంగా చెప్పుకుంటుంటారు. అలానే చంద్రబాబును, టీడీపీ విమర్శించాలనుకున్నప్పుడు “యూటర్న్ బాబు” అని విమర్శిస్తుంటారు… అధికారంలో ఉన్నప్పుడు, రాజకీయంగానూ అనేక సందర్భాల్లో చంద్రబాబు చాలా అంశాల్లో తన వైఖరిని మార్చుకోవడంతో వైసీపీ చంద్రబాబుకు యూటర్న్ బిరుదు వచ్చేసింది..! చంద్రబాబుకు విశ్వసనీయత లేదనీ ఎన్నికల సమయంలో
ప్రజల్లో బలంగా తీసుకువెళ్లింది వైసీపీ. అయితే రాజకీయం అన్నాక అధికార పక్షం వేరు, ప్రతిపక్షం వేరు.. ఆ నాడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం వల్ల మాటలు మార్చడం, యూటర్న్ లు తీసుకోవాల్సిన సందర్భాలు రాలేదు. అధికారంలో ఉన్న వాళ్ల మాట తప్పాల్సి వస్తుంది మడమ తిప్పాల్సి వస్తుంది. యూటర్న్ లు తీసుకోవాల్సిన వస్తుంది అన్నది జగన్మోహనరెడ్డికి అధికారంలోకి వచ్చిన తరువాత బోధపడుతుంది.. అందుకే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఆలోచిస్తూ “మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు” ఒక్కోసారి యూటర్న్ లు కూడా తీసుకుంటున్నారు.
YS Jagan: ఇవి కొన్ని సందర్భాలు..!
జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఫించన్ లను మూడు వేలు చేస్తారని చెప్పారు, కానీ చేశారా..!? అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి రూ .250లు చొప్పున నాలుగేళ్లు వరుసగా పెంచుకుంటూ వెళతామన్నారు. అదీ చేశారా..? అంటే లేదు. మే 2019 లో రూ. 250 పెంచిన ఫించన్ 2020 మే, 2021 మే నెలలోనూ పెంచలేదు. ఈ విషయంలో మొదట మాట తప్పారని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శిస్తూనే ఉంది. ఇకపోతే శాసనమండలి రద్దు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా..? అంటే అదీ లేదు. కొత్త వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తూ వస్తోంది. ఇలా చాలా విషయాల్లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మాట తప్పారు, మడమ తిప్పారు. యూటర్న్ తీసుకున్నారు. ఇవి పార్టీ కోసం, ప్రజల కోసం తన కోసం తప్పలేదు.. అధికార పక్షంలోకి వచ్చాక మొండి నిర్ణయాలు పనిచేయవు.. ఇప్పుడు తాజాగా విద్యుత్ ట్రూ అప్ చార్జీల విషయంలోనూ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
మాట తప్పినా మంచిదే..!
విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలను నూతనంగా గత నెల నుండి వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్మోహనరెడ్డి ఆమోదంతోనే విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలను పెంచారు. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం తో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం ట్రూ ఆప్ చార్జీల వసూళ్లను నిలిపివేస్తూ నిన్న ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది. ట్రూ అప్ చార్జీల విషయంలో జగన్మోహన రెడ్డి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే చాలా కారణాలే ఉన్నాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జగన్మోహనరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వాళ్లు చెప్పుకుంటున్నప్పటికీ అసలైన కారణాలు మాత్రం వేరే ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వం విద్యుత్ ట్రూ ఆప్ చార్జీలను వేసినప్పటి నుండి విద్యుత్ వినియోగదారులకు వారి కరెంటు బిల్లు 30 నుండి 40 శాతం పెరిగి వస్తోంది. అంటే నెలకు 500 ల బిల్లు చెల్లించే వాళ్లు రూ.650 నుండి రూ.700 వరకూ, వెయ్యి రూపాయలు బిల్లు వచ్చే వినియోగదారుడు రూ.1300 నుండి రూ.1400 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల నుండి వస్తున్న తీవ్ర వ్యతిరేకత ఒక కారణం కాగా, పలువురు వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంలోనూ హైకోర్టు నుండి అక్షింతలు తప్పవని ప్రభుత్వం భావించింది. మరో విషయం ఏమిటంటే బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు విద్యుత్ ట్రూ ఆప్ చార్జీల అంశం ఆయుధంగా మారకుండా ఉండేందుకు ప్రభుత్వం వెనక్కు తగ్గింది అన్న మాట కూడా వినిపిస్తోంది.. అందుకే వెనక్కు తగ్గక తప్పలేదు..!