ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా మొదటి సారి క్యాబినెట్లో ఉన్న మంత్రులకు రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి నిర్ణయించడం కూడా జరిగింది. ఆ రెండున్నర సంవత్సరాలలో చేసే పనిని బట్టి తర్వాత నిర్ణయం ఉంటుందని వైఎస్ జగన్ మొదటిలో మంత్రులు గా ఎన్నికైన వారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అదే రీతిలో ఆశావహులకు కూడా నెక్స్ట్ ఖచ్చితంగా అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మంత్రివర్గంలో చేరిన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి ఇటీవల రాజ్యసభకు వెళ్లడంతో వారి స్థానాలలో చెల్లుబోయిన వేణు గోపాల్, సిదిరి అప్పలరాజు లను తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ప్రస్తుతం వైఎస్ జగన్ క్యాబినెట్లో ఉన్నారు. కానీ మోపిదేవి తప్పుకోవటంతో గుంటూరు జిల్లాలో ఒకరు మాత్రమే మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
గుంటూరు జిల్లా నుంచి హోంమంత్రి సుచరిత మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. అదే రీతిలో విశాఖపట్టణం, అనంతపురం జిల్లాలో కూడా ఒక్కరు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు జిల్లాలు పెద్దది కావడంతో పాటు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ఉండటంతో పెద్ద జిల్లాలైన ఈ ప్రాంతాల నుండి ఒక్క మంత్రి ఉండటం పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని సీనియర్ నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చినట్లు డిస్కషన్లు చేసినట్లు పార్టీలో టాక్.
దీంతో నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో మరో బెర్త్ కేటాయించాలని వైఎస్ జగన్ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం ఈ మూడు జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో… ఓ నివేదిక జగన్ తెప్పించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూడు ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు ఆ లిస్టులో తన పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్ నివాసం తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్నాట్లు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.